పీఆర్సీ ఎవరిని మభ్యపెట్టడానికి?

by  |
పీఆర్సీ ఎవరిని మభ్యపెట్టడానికి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీఆర్సీ నివేదికను ఓ ప్లాన్ ప్రకారం బయటకు లీక్ చేశారా అని చర్చ జరుగుతోంది. ఉద్యోగుల మనోభావాలను తెలుసుకునేందుకు బయటకు లీక్​చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారంటూ ఒక వర్గం ప్రచారానికి దిగింది. క్రిమినల్ కేసు నమోదు చేశారని చెబుతున్నారు. ఉద్యోగులు 30 శాతం ఫిట్‌మెంట్‌పై ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వవర్గాలే పైచేయి సాధించారని అంటున్నారు. ముందుగానే 30 శాతం ఇస్తామంటే 40 శాతం వరకు పట్టుబడతారనే కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. కమిషన్ 7.5 శాతామే సూచించిన విషయం తెలిసిందే.

వెనక్కి తగ్గుతున్న ఉద్యోగులు

ఈసారి ఫిట్‌మెంట్ ​63 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు వినతులిచ్చాయి. తెలంగాణ తొలి ప్రభుత్వంలో పదో పీఆర్సీ 43 శాతం ఇచ్చారు. కనీసం 45 శాతమైనా వస్తుందని ఆశ. కమిషన్​ మాత్రం పొంతన లేకుండా నివేదిక ఇచ్చింది. ఎంత ఎక్కువ అడుగుదామన్న కమిషన్ సూచనలతో పోల్చుకోవాల్సి ఉంటుంది. కమిషన్ ఒకవేళ 20 శాతంగా సూచిస్తే ఉద్యోగులు 40 శాతంపై పట్టుమీదుండేవారు. నివేదికలో మాత్రం పది శాతానికి లెక్క కట్టింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా వెనక్కి తగ్గుతున్నాయి. 63 శాతం ఫిట్‌మెంట్‌ను వదిలేశాయి. 33 లేదా 30 శాతం వరకైనా ఇవ్వాలంలున్నాయి

ఇక కమిషన్ ఎందుకో మరి?

సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్‌మెంట్ ఇస్తారని ఉద్యోగులు ధీమాతో కనిపిస్తున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడిస్తున్నారు. అంటే ఇప్పుడు కమిషన్ నివేదికలన్నీ పక్కనపెట్టి సీఎం కేసీఆర్ ఫిట్‌మెంట్ ప్రకటిస్తారని చెబుతున్నారు. కమిషన్ వద్దన్నా ఫిట్‌మెంట్ పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ఉద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి, 32 నెలల పాటు అధ్యయనం చేసి, దాదాపుగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టిన వేతన సవరణ నివేదిక ఎందుకేసినట్లనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని, ఫిట్‌మెంట్ ప్రకటించే అధికారం ఉండగా కమిషన్‌ను ఎందుకు బూచిగా చూపిస్తున్నారనేది జరుగుతున్న ప్రచారం.

రూ.6,756 కోట్ల భారం

అనుకున్నట్టుగానే సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తే ప్రభుత్వానికి ఏటా అదనంగా పడుతున్న భారం రూ.6,756 కోట్లు. ప్రస్తుతానికి కమిషన్​సూచించిన ప్రకారమైతే పది శాతం ఫిట్‌మెంట్‌తో ఏటా రూ.2,252 కోట్ల భారం పడుతుందని సూచించారు. అదే 30 శాతం ఇస్తే మాత్రం ఇది రూ.6,756 కోట్లకు చేరుతోంది. ఇలా చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వనరుల సమీకరణ ఎలా అనేది కూడా సందేహంగానే మారింది. ఇప్పటికే అప్పుల్లో ఉన్నట్లు నివేదికల్లో స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక వేతనాలు ఇస్తున్న నాల్గో రాష్ట్రమంటూ సూచించారు.

Next Story

Most Viewed