పోతిరెడ్డిపాడు విస్తరణ తక్షణం ఆగాలి

by  |
పోతిరెడ్డిపాడు విస్తరణ తక్షణం ఆగాలి
X

– కృష్ణా బోర్డు చోద్యం చూస్తోంది
– కేంద్రం నిర్లక్ష్యంతోనే జల జగడాలు
– పరిష్కారానికి బదులు ఆజ్యం పోసింది
– శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ తెలంగాణకు అప్పజెప్పాలి
– కేంద్ర జల మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు విస్తరణ (రాయలసీమ) ప్రాజెక్టును తక్షణం ఆపివేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర జలశక్తి మంత్రికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కృష్ణా జలాలను బేసిన్ వెలుపలకు తీసుకెళ్ళే ఉద్దేశంతో గతంలో నిర్మించిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సహా ఇప్పుడు నిర్మించ తలపెట్టిన విస్తరణ ప్రాజెక్టుకు చట్టబద్ధత లేదని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్నా కృష్ణా నది యజామాన్య బోర్డు చోద్యం చూస్తూ ఉన్నదని, విస్తరణ ప్రాజెక్టును నిరోధించలేకపోయిందని కేసీఆర్ శుక్రవారం రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం సైతం రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీని సుగమం చేయడానికి బదులు మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం వెనక అసలు ఉద్దేశం ప్రధాన దృష్టిని మళ్ళించే ఎత్తుగడేనని వ్యాఖ్యానించారు. తెలంగాణకు జరిగిన కేటాయింపుల వినియోగంలో భాగంగానే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించినవేనని పలు ఉదాహరణలతో కేసీఆర్ వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషనల్ కంట్రోల్‌ను తెలంగాణకు అప్పజెప్పాలని 14 పేజీల లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం (1956)లోని సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేండ్లుగా ట్రిబ్యునల్‌కు నివేదించకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసిందని, ఆ నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటికీ పొందలేకపోతోందని పేర్కొన్నారు. రోజుకు మూడు టీఎంసీల చొప్పున తరలించే విస్తరణ ప్రాజెక్టును ఆపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీశైలం దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితోపాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. బేసిన్లు, బేషజాలు లేకుండా రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ సజావుగా జరుపుకోవాలనేదే తెలంగాణ విధానమని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed