MLA Raja Singh: నన్ను వందశాతం చంపేస్తారు.. డేట్ కూడా రాసుకోండి : రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk |
MLA Raja Singh Controversial Comments On Love Jihad
X

దిశ, తెలంగాణ బ్యూరో : MLA Raja Singh Controversial Comments On Love Jihad| గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం కోసం మాట్లాడుతున్న తనను వందకు వంద శాతం చంపేస్తారని, ఈ విషయం తనకు కూడా తెలుసని సంచలన కామెంట్స్ చేశారు. గ్రేటర్ పరిధిలోని నగర శివారులో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని, ముస్లింలుగా కన్వర్ట్ చేస్తున్నారన్నారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను పిల్లలను కనే మిషన్లుగా తీర్చిదిద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులపై వ్యతిరేకంగా హిందువులతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారన్నారు. ధర్మం కోసం ఎదిరించి మాట్లాడితే గొంతులు, తలలు నరుకుతున్నారు. ధర్మం గురించి మాట్లాడే తనలాంటి వారు కొంతమంది ఉండొచ్చని, దీనిపై మాట్లాడుతున్నందుకు ఇవ్వాళ కాకుంటే రేపు తనపై బుల్లెట్లను ఉపయోగిస్తారని రాజాసింగ్ చెప్పారు. వందకు వంద శాతం తనను చంపేస్తారని, ఇది పక్కా అని, డేట్ కూడా రాసి పెట్టుకోండని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

తనను చంపేస్తారనే విషయం తనకు కూడా తెలుసని, అయితే చచ్చేముందు తనదొక కల ఉందన్నారు. ప్రజలు కూడా తనలాగే తయారుకావాలని, ఇది తన సంకల్పమని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ హిస్టరీ తాను చదివానని, బతకాలంటే ఆయనలా బతకాలని, చావాలంటే ఆయన కొడుకు శంభూజీలాగా చావాలని, వారిది గొప్ప చరిత్ర అని కొనియాడారు. ఇది కేవలం తన ఒక్కరి కల కాకూడదని, ప్రతి ఒక్క హిందువు కలగా మారాలని కోరారు. ప్రతి ఒక్కరూ ధర్మ రక్షణకు పాటుపడాలని, లేదంటే భవిష్యత్‌లో అందరూ మత మార్పిడి కావాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. రాజకీయం వేరు.., ధర్మం వేరని రాజాసింగ్ తెలిపారు. ధర్మాన్ని రక్షించాలంటే బీజేపీలోనే ఉండాలనే రూల్ ఏం లేదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో ఉంటారా? కాంగ్రెస్‌లో ఉంటారా? బీజేపీలో ఉంటారా అనేది ఎవరి ఇష్టం వారిదని చెప్పారు. బీజేపీలో ఉన్న నాయకులు పూజలు చేస్తారు.., టీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఉండే నాయకులు, కార్యకర్తలు పూజలు చేయరా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.

ఎవరు ఏ పార్టీలో ఉన్నా ధర్మాన్ని రక్షించవచ్చని ఆయన సూచించారు. అందుకు ఆలోచనలో కొన్ని మార్పులు చేస్తే చాలని సూచనలు చేశారు. జై శ్రీరామ్ అంటే బీజేపీ అనే ముద్ర ఎందుకు వేస్తున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. రాముడు బీజేపీకి మాత్రమే చెందిన వాడా? టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతి రాజకీయ నాయకుడిని తాను కోరేది ఒక్కటేనని, లవ్ జీహాదీని, మత మార్పిడిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్‌కు కోలుకోలేని షాకిచ్చిన మహిళ


Next Story