మేఘాలయ అసెంబ్లీ పోల్స్: ఓటర్లను ప్రభావితం చేసే అంశాలివే?

by Disha Web Desk 4 |
మేఘాలయ అసెంబ్లీ పోల్స్: ఓటర్లను ప్రభావితం చేసే అంశాలివే?
X

దిశ, వెబ్‌డెస్క్: మేఘాలయలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన అంశం నిరుద్యోగం. యువతలో ప్రధానంగా ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ ఉంది. ఇందుకు అనుగుణంగానే అక్కడి పార్టీలు తమ మెనిఫెస్టోను రూపొందించాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) కేంద్రంలోని బీజేపీని ప్రధానంగా ఇన్నర్ లైన్ పర్మిట్ అంశాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. ఒక జాతీయుడు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రమాణ పత్రమే ఈ ఇన్నర్ లైన్ పర్మిట్.

మేఘాలయలో మరో కీలక అంశం ఖాసీ పర్వత ప్రాంతల్లో ఉండే క్రిస్టియన్లు, నాన్ క్రిస్టియన్లు. మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్కెస్ట్ మార్వి వీరినుద్దేశించి శుక్రవారం మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్ తినడంపై ఆంక్షలు విధించబోమన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన క్రిస్టియన్ మెజార్టీ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే క్రిస్టియన్ల భద్రతకు కట్టుబడి ఉన్నామన్నారు. బీఫ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు. తినే అలవాటు మన సంస్కృతి అని బీజేపీ ఈ అంశంలో ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు విధించదని తెలిపారు.

మనలో చాలామంది పోర్క్, బీఫ్, చికెన్, ఫిష్ తింటాం కదా అన్నారు. ఈ అంశం గురంచి చర్చకు తావు లేదన్నారు. రాష్ట్రంలో 59 స్థానాలకు గాను 3,419 పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. మొత్తం 60 స్థానాలున్న మేఘాలయలో కాసీ రిజియన్‌ జైన్తియా పర్వత ప్రాంతాల్లో 36, గరో పర్వత ప్రాంతాల్లో 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. సొహొంగ్ అసెంబ్లీ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది.

ఈ స్థానం నుంచి అభ్యర్థిగా ఉన్న యూడీపీ పార్టీకి చెందిన ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి చనిపోవడం కారణంగా ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 21,75,236 మంది ఓటు హక్కు కలిగి ఉండగా వీరిలో మహిళా ఓటర్లు 10.99 లక్షలు ఉండగా పురుష ఓటర్లు 10.68 మంది ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఈ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు. మేఘాలయలో తొలిసారి 81,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోరులో మొత్తం 369 మంది నిలవగా అందులో 36 మంది మహిళలు ఉన్నారు. 44 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. అవినీతి ఆరోపణలు అధికార ఎన్‌పీపీ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. జైన్తియా, ఖాసీ పర్వత ప్రాంతాల్లో అక్రమ కోల్ మైనింగ్ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. కాగా మేఘాలయ అసెంబ్లీ గడవు మార్చి 15తో ముగియనుంది.

ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఆయా పార్టీలు 31 స్థానాలు గెలవాల్సి ఉంది. మేఘాలయ సీఎం కన్రాడ్ సాంగ్మా సౌత్ టూరా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. బీజేపీ నుంచి బెర్నార్డ్ ఎన్ మరాక్ పోటీలో ఉన్నారు. మాజీ సీఎం ముకుల్ సాంగ్మా రెండు స్థానాల్లో పోటీకి దిగారు. మేఘాలయలో ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ పార్టీ తరపున ప్రచారంతో పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ సైతం షిల్లాంగ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ సైతం బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 119 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సులను ఈసీ(ఎన్నికల కమిషన్) రంగంలోకి దింపింది. ఎన్నికల సందర్భంగా మార్చి 2 వరకు మేఘాలయలో ఉన్న బంగ్లాదేశ్ బార్డర్ ను మూసివేశారు. వీటితో పాటు మయన్మార్, అస్సాం బార్డర్ లను సీల్ చేసినట్లు చీఫ్ ఎలక్టోరోల్ ఆఫీసర్ తెలిపారు. 369 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 21 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా..

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 21 స్థానాలను గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 20 సీట్లలో గెలుపొందింది. బీజేపీ 2, ప్రాంతీయ పార్టీలు 6 సీట్లు కైవసం చేసుకున్నాయి. బీజేపీ, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్‌పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్ పీపీ మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్ పేరిట బీజేపీ, యూడీపీతో అధికారం చేపట్టింది. కాగా ఈ సారి ఎన్‌పీపీ, బీజేపీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో టీఎంసీ 58 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది.

Next Story

Most Viewed