ఓరుగల్లులో పొలిటికల్ హీట్.. వాటి చుట్టే రాజకీయం

by  |
ఓరుగల్లులో పొలిటికల్ హీట్.. వాటి చుట్టే రాజకీయం
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప‌ట్టభ‌ద్రుల మ‌ద్దతు కూడ‌గ‌ట్టుకునేందుకు పార్టీలు స‌ర్వశ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఓట‌ర్లను త‌మ‌వైపు తిప్పుకునేందుకు హామీల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఆరోప‌ణ‌ల‌తో ప్రత్యర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. గ‌తంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై పెద్దగా చ‌ర్చ లేకుండానే, వ‌చ్చిపోయిన విష‌యం కూడా సామాన్య జ‌నం గుర్తెర‌గ‌క ముందే ముగిసిపోయేవి. కానీ ఈ ఎన్నిక‌ల ప్రచారం అందుకు భిన్నంగా సాగుతుండ‌టం విశేషం. ఎమ్మెల్సీ అభ్యర్థుల‌ ఎన్నిక‌ల ప్రచారంతో చారిత్రక ఓరుగ‌ల్లు జిల్లా రాజ‌కీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయ‌క్‌ను గెలిపించాల‌ని కోరుతూ పీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల పాటు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ప్రచారం సాగించారు. అలాగే ప‌ల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాల‌ని కోరుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రచార స‌భ‌లు స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు మునుపెన్నడు లేనంతంగా హైప్ క్రియేట్ అయింది. ఎవ‌రూ గెలుస్తారు..? ఎవ‌రి విధానాలు ఏంటీ.? ఏపార్టీ స‌చ్చిల‌త ఎంత‌.? అంటూ ప‌ట్టభ‌ద్రులే కాక సామాన్య ప్రజానీకం కూడా తూకం వేస్తోంది. ఎక్కడ న‌లుగురు క‌లిసినా ఇదే చ‌ర్చ… ఏ వాట్సాప్ గ్రూపులోనైనా ఇదే రాజ‌కీయ ర‌చ్చే క‌న‌బ‌డుతోంది.

ఉద్యోగాల భ‌ర్తీ లెక్కల‌ చుట్టే రాజ‌కీయం..

దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ ఫ‌లితాల్లో టీఆర్ఎస్‌ వ్యతిరేక తీర్పు ప్రతిధ్వనించ‌డంతో విప‌క్షాల అభ్యర్థులు యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఆయుధాలుగా చేసుకుంటూ జ‌న‌క్షేత్రంలో దూసుకెళ్తున్నారు. అదే స‌మయంలో ఉద్యోగ‌, నిరుద్యోగ‌, రిటైర్డు ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చ‌ర్యలు తీసుకుంటోంద‌ని అధికార పార్టీ నేత‌లు త‌మ స‌చ్చిల‌త‌ను ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీల్లో అంతా డొల్లేన‌ని, చేసింది త‌క్కువ‌, చెప్పుకునేది ఎక్కువంటూ విప‌క్షాలు ఆధారాల‌తో స‌హా తూర్పార‌బ‌డుతున్నారు. బిశ్వాల్ క‌మిటీ నివేదిక‌ను ఉదాహ‌రిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలెన్ని… ఇప్పుడున్నవి ఎన్నంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. 1ల‌క్ష32వేల‌కు పైగా ఉద్యోగాలను భ‌ర్తీ చేసిన‌ట్లుగా మంత్రి కేటీఆర్ గురువారం విడుద‌ల చేసిన బ‌హిరంగ లేఖపై టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెస‌ర్ కోదండ‌రాం మ‌హ‌బూబాబాద్‌లో త‌ప్పుబ‌ట్టారు. నిస్సిగ్గుగా త‌ప్పుల‌ను చెబుతూ ఒప్పని ప్రజ‌ల‌ను న‌మ్మించే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని ధ్వజ‌మెత్తారు.

సోష‌ల్ మీడియా వేదిక‌పై ర‌చ్చ..

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ సామాజిక మాధ్యమాల్లో రాజ‌కీయ ర‌చ్చ న‌డుస్తోంది. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నాయ‌కులు మొద‌లు కార్యకర్తల వ‌ర‌కు ప్రత్యర్థుల‌పై వ్యక్తిగ‌త విమర్శల‌కు దిగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఆయ‌న ప‌ది కూడా పాస్ అయిండో లేదో ఆయ‌న‌కు ఓటేస్తే ఏం లాభం అంటూ ఓ ప్రజాప్రతినిధి వ్యాఖ్యానిస్తే, వాళ్లు చెబితే వాళ్లంట్లో వారే ఓట్లేయ్యని వారు నాయ‌కుల‌మని చెప్పుకుంటూ బ‌య‌ట తిరుగుతున్నారంటూ టీఆర్ ఎస్‌కు చెందిన ఓ కీల‌క ప్రజాప్రతినిధి ప్రత్యర్థుల‌ను ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధులే హ‌ద్దులు మీరి వ్యాఖ్యలు చేస్తుండ‌టంతో సామాన్య కార్యక‌ర్తలు వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చిపోతున్నారు. దుర్బాష‌లాడుకుంటున్నవారూ ఉన్నారు. బిడ్డా..నీ ప్రచారం నువ్వు చేసుకో… సంస్కారం లేకుండా మాట్లాడ‌కు.. టీఆర్‌ఎస్ నేత‌ల లెక్క కాదు నేను.. నా మీద దుష్ప్రచారం చేస్తే నీకు..నీ టీం నాలుక చీరేస్తా అంటూ ఓ అభ్యర్థిని ఉద్దేశించి యువ‌తెలంగాణ అభ్యర్థి రాణి రుద్రమ‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో రాజ‌కీయాలు ఈస్థాయిలో వేడెక్కగా.. మున్ముందు ఈ వాదులాట‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed