పోలీసుల రక్షణ వలయంలో ఎర్రవల్లి.. నో ఎంట్రీతో నిర్మానుష్యంగా గ్రామం

by  |
పోలీసుల రక్షణ వలయంలో ఎర్రవల్లి.. నో ఎంట్రీతో నిర్మానుష్యంగా గ్రామం
X

దిశ, గజ్వేల్/మర్కుక్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ రకాల ఫోర్స్‌లతో గ్రామాన్ని, పొలిమేరలతో సహ దిగ్బంధనం చేశారు. ఎర్రవల్లి వెళ్ళే రహదారులు, లింక్ రోడ్లను కూడా వదలకుండా పోలీసులు మోహరించి అష్ట దిగ్బంధనం చేశారు. అలాగే చుట్టుప్రక్కల గ్రామాలను సైతం పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకోన్నారు.

దీంతో పాములుపర్తి, కాశిరెడ్డిపల్లి, దామరకుంట, గంగాపూర్, యూసుభ్ఖాన్ పల్లి, నర్సన్నపేట, చేబర్తి, ఇటిక్యాలతో పాటు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు వెళ్ళే రైతులను, మహిళలను, రోజు వారీ కూలి పనులకు వెళ్ళే వ్యక్తులను సైతం పోలీసులు అడ్డుకుంటూ తిరిగి ఇళ్ళల్లోకి పంపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రవల్లిలో నేడు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో సహా, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నేతల త్రయం పాల్గొంటోందని ప్రచారం కూడా చేశారు. ఇదిలా వుంటే సభా నిర్వహణకు అనుమతుల్లేవంటూ ఆదివారం అర్ధరాత్రి నుండే కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేశారు.

జిల్లా నుంచి ఎర్రవల్లి గ్రామం ఎంట్రీకి వీలున్న ప్రధాన రహదారులన్నింటి దగ్గర ప్రత్యేకంగా చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. బస్సుల్లో, కార్లలో వెళ్లే ప్రయాణికులను సైతం పోలీసు బృందాలు క్షుణ్ణంగా తనీఖీలు నిర్వహిస్తున్నాయి. కాగా, ఎర్రవల్లి గ్రామానికి వెళ్ళేందుకు ప్రధానమైన వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిని, శామీర్ పేట అలియాబాద్ చౌరస్తాలోనూ పోలీసులు మోహరించి ప్రయాణికులను అడ్డుకుంటున్నారు. నాలుగంచెల విధానంలో పోలీసులు రక్షణ విధానాన్ని ఏర్పాటు చేసి కాలి నడక ప్రయాణికులను సైతం అడ్డుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామానికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదంటూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐ, ఎస్ఐలతో పాటు సుమారు 200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. మీడియాకు సైతం ఎర్రవల్లికి ఎంట్రీ లేదంటూ ఖరాఖండిగా చెబుతూ మీడియాతోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సీఎం వ్యవసాయ క్షేత్రం దగ్గర పోలీసు బలగాలు మోహరించి, రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలీసుల చర్యలతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఓవర్ యాక్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed