పచ్చని తెలంగాణకై పనులు షురూ చేసిన ప్రభుత్వం

by  |
పచ్చని తెలంగాణకై పనులు షురూ చేసిన ప్రభుత్వం
X

దిశ, అనంతగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో హరితహరం నర్సరీలను ఏర్పాటు చేసి అందులో విరివిగా మొక్కలు పెంచే ప్రణాళిక సిద్ధం చేస్తోంది.అందుకోసం గ్రామాల్లో ప్రత్యేకంగా హరితహారం నర్సరీలు ఏర్పాటు చేసి ఆ నర్సరీలో మొక్కలు పెంచి వర్షాకాలంలో నాటిస్తోంది. అదే తరహాలో వచ్చే ఏడాది చేపట్టే 8వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి నర్సరీలో మొక్కల పెంపకం ముమ్మరం చేశారు. ఏ ఏ గ్రామపంచాయతీలో ఎన్ని మొక్కలు పెంచాలనే లక్ష్యాన్ని ఉన్నత అధికారులు ఇప్పటికే నర్సరీ నిర్వాహకులకు,ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు.

ఒక కోటి రెండు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు,రోడ్ల వెంట 7 ఏళ్లుగా జిల్లా వ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటారు. నాటిన మొక్కలను వంద శాతం బతికించేందుకు కృషి చేస్తూ వాటిని పెంచి పెద్ద చేస్తున్నారు.అదే తరహాలో ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా ఒక కోటి రెండు లక్షల మొక్కలు నాటేందుకు 475 నర్సరీల్లో ఒక్కొక్క నర్సరీలో చిన్న,పెద్ద గ్రామ పంచాయతీలలో 15 వేల,25 వేలు చొప్పున మొక్కలు పెంచుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నర్సరీలు 419,ప్రైవేట్ నర్సరీలు 56 కలవు. గ్రామాల్లోని నర్సరీలో మొక్కల పెంపకంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.ఇప్పటివరకు 50 శాతానికి మించి 52లక్షల బ్యాగులను నింపడం జరిగింది.

కూలీలకు లభిస్తున్న ఉపాధి

నర్సరీలో మొక్కల పెంపకానికి అవసరమైన కూలీలను ఉపాధి హామీ పథకం ద్వారా వినియోగిస్తున్నారు.అయితే ప్రతి రోజు ఒక్కొక్క నర్సరీలో ఐదు నుంచి పది మందికి పైగా కూలీలకు ఉపాధి లభిస్తుంది.ఆ కూలీలు మొక్కల సంరక్షణకు అవసరమైన పనులు చేస్తూ ప్రతి రోజు ఒక కూలీ దాదాపు రూ.250 చొప్పున ఆదాయం పొందుతున్నారు.

నర్సరీల్లో అధికంగా నీడనిచ్చే మరియు పండ్ల మొక్కల పెంపకం

గ్రామాల్లో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది అధికంగా నీడనిచ్చే, పండ్ల,పూల మొక్కలు పెంచుతున్నారు. అయితే ఆ మొక్కలను వచ్చే ఏడాది జూన్ మాసంలో నిర్వహించే 8వ విడత హరితహారంలో భాగంగా ఇంటింటికి పంపిణీ చేసేందుకు వాటిని పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ మొక్కలతో పాటు, పండ్ల మొక్కలను కలిపి ప్రతి ఒక్కరికి ఇంట్లో కనీసం 5,6 మొక్కలు ఇచ్చి పెంచాలని ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయా గ్రామాల్లో సర్పంచులు పంచాయితీ కార్యదర్శులు మొక్కల పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారం విజయవంతం చేసేందుకు జిల్లా, మండల అధికారులు ప్రజాప్రతినిధులు సన్నద్ధం అవుతున్నారు.

ప్రతి రోజు పని దొరుకుతుంది

హరిత హారంలో నాటేందుకు అవసరమైన మొక్కలకు మా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో పెంచుతున్నాం. గత 20 రోజుల నుంచి ప్యాకెట్లలో మట్టిని నింపి వాటిలో విత్తనాలు పెట్టి వాటరింగ్ చేస్తున్నాము. అవి పెరిగి వేర్లు పెద్ద గా అయిన తర్వాత తిరిగి మొక్కల ఏత్తుల ప్రకారం గ్రేడింగ్ చేసి బ్యాగుల స్థానాన్ని మారుస్తాము.ప్రతిరోజు మాకు పని దొరుకుతుంది. రోజుకు రూ.245 చొప్పున కూలి వస్తుంది. దీంతో మా కుటుంబం పూట గడుస్తుంది.

కత్తి మల రేణుక కూలీ..అనంతగిరి గ్రామం

లక్ష్యం మేరకు పెంచాలి..

నర్సరీలలోని బ్యాగులలో మట్టి నింపి విత్తనాలను నాటే ప్రక్రియ గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం ముందుగానే పంచాయతీ కార్యదర్శులకు,ఉపాధి హామీ కూలీలకు నర్సరీ మొక్కల పెంపకంపై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయా గ్రామాల్లో కేటాయించిన నర్సరీలో మొక్కలు పెంచేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే 50 శాతం పైగా పనులు పూర్తి చేశాం. మిగిలిన పనులు త్వరలో పూర్తి చేసి నర్సరీలలోని మొక్కలను వచ్చే సంవత్సరం జూన్ నాటికి అందుబాటులో ఉంచాలి.

డి.ఆర్.డి.ఓ కిరణ్ కుమార్


Next Story

Most Viewed