తెలంగాణ డిస్కంల పనితీరు ఫెయిల్

by  |
Electrical Discoms
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో డిస్కంల పనితీరు అధ్వానంగా ఉంది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల పనితీరు 50 శాతం కంటే తక్కువగా ఉందని కేంద్రం విడుదల చేసిన తొమ్మిదో వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్‌లో వెల్లడించింది. 41 సంస్థలపై జరిపిన గ్రేడింగ్‌లో ఎస్పీడీసీఎల్ కు ‘బీ’ గ్రేడ్, ఎన్పీడీసీఎల్ కు ‘సీ+’ గ్రేడ్ వచ్చింది. తెలంగాణకు చెందిన ఏ ఒక్క సంస్థ కూడా 50 స్కోర్‌ను కూడా దాటకపోవడం గమనార్హం. ఎస్పీడీసీఎల్‌కు పనితీరు బిలో యావరేజ్ అంటే కేవలం 35 నుంచి 50 స్కోర్ లోపే ఉంది. ఎన్పీడీసీఎల్ తీరు మరీ అధ్వానంగా తయారైంది. 20 నుంచి 35 స్కోర్ లోపే ఉండటం గమనార్హం. దేశంలోని అన్ని విద్యుత్ సంస్థలపై ఈ రివ్యూ చేశారు. కాగా అందులో అంశాల వారీగా మార్కులు, గ్రేడ్ అందించారు.

ఇదీ ఎస్పీడీసీఎల్ పనితీరు..

ఈ రివ్యూలో ఎస్పీడీసీఎల్ సంస్థ విద్యుత్ లీకేజీల నివారణలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. విద్యుత్ లీకేజీల నష్టం 15.41గా ఉందని తెలిపింది. అయితే ఎక్కువ శాతం విద్యుత్ కొనుగోలుకు మొగ్గుచూపడం ఆందోళన చెందాల్సిన విషయమని కేంద్రం ఈ నివేదికలో తెలిపింది. సొంతంగా ఉత్పత్తి చేసుకునే శాతంతో పోల్చితే కొనుగోలు శాతం ఎక్కువగా ఉండటం వల్ల గ్రేడ్ దిగజారింది. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ విద్యుత్ కొనుగోలుపైనే సంస్థ ఆధారపడుతోందని పేర్కొంది. విద్యుత్ చార్జీలు పెంచాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్న నిర్ణయం అప్రూవల్ కాకపోవడం వల్ల కూడా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. సంస్థ సమయానికే బిల్లింగ్ చేస్తున్నా.. వసూళ్లలో నిర్లక్ష్యం వహించడం వల్ల ర్యాంక్ దిగజారింది. విద్యుత్ లీకేజీలు తగ్గించుకొని కలెక్షన్లను పెంచుకోవాల్సిన అవసరముందని కేంద్రం ఈ నివేదిక ద్వారా సంస్థకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న సబ్సిడీని సమయానికి జమచేయకపోవడం వల్ల, విద్యుత్ చార్జీలు పెంచడంపై నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నట్లు పేర్కొంది. అలాగే కలెక్షన్ లో జరిగే సమస్యలను అధిగమించాలని ఈ నివేదికలో పేర్కొంది.

ఎన్పీడీసీఎల్..

తొమ్మిదో వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్‌లో ఎన్పీడీసీఎల్ సంస్థ గ్రేడ్ ‘సీ+’కు చేరుకుంది. అయితే బిల్లుల వసూళ్లు, ఖర్చు పరిమితుల పరంగా ఎన్పీడీసీఎల్ సంస్థ 91 శాతంతో మెరుగ్గా ఉందని కేంద్రం ఈ రిపోర్ట్ లో పేర్కొంది. అయితే 2019తో పోల్చుకుంటే 2020లో విద్యుత్ లీకేజీలు 34.49 శాతం చేరుకుందని పేర్కొంది. విద్యుత్ కొనుగోలుకు కూడా యూనిట్‌కు రూ.5.26 వ్యయంతో కొనుగోలు చేస్తున్నట్లు నివేదికలో తెలిపింది. విద్యుత్ చార్జీల పెంపు లేకపోవడంతో పాటు సబ్సిడీలను సమయానికి జమచేయకపోవడం ఎఫెక్ట్ ర్యాంకింగ్ పై పడింది.

Next Story

Most Viewed