డబుల్ ట్రబుల్స్.. ఆశలన్నీ అడియాశలేనా?

by  |
Sherilingampalli1
X

దిశ, శేరిలింగంపల్లి: బ్రతుకుదెరువుకోసం పట్నం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నిలువ నీడలేని నిరుపేదలు, కాయకష్టం చేసి రోడ్ల పక్కనే పిల్లా పాపలతో జీవనం సాగించే బడుగు జీవులు. రెక్కాడితే గానీ డొక్క నిండని అడ్డా కూలీలు, దినదినగండంగా రోజులు వెళ్లదీస్తున్న అభాగ్యులు ఎంతోమందికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ వారికి సొంతింటి కల నిజమవుతుందన్న ఆశ కల్పించింది. తమకూ ఉండేందుకు ఓ గూడు దొరుకుతుందన్న భరోసా దొరికింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలతో హైదరాబాద్ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేదలు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రోజుల తరబడి మీ సేవా సెంటర్ల వద్ద, జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో పడిగాపులు కాశారు. పోటీపడి దరఖాస్తు చేసుకున్నారు. కానీ నేటికి చాలామందికి ఇంకా ఎదురుచూపులే మిగిలాయి. వారి ఆశలన్నీ అడియాశలే అవుతున్నాయి. డబుల్ బెడ్రూంస్ మేడలు కనిపిస్తున్నా అర్హులకు మాత్రం నేటికి నీడ దొరకని పరిస్థితి.

ఎప్పుడు ఇస్తారు.. ఎలా ఇస్తారు..?

అల్లుడు ఇంటికి వస్తే కాలుమీద కాలు వేసుకుని అత్తారింట్లో దర్జాగా కూచోవాలి, మా ఆడ బిడ్డలు తమ సొంత ఇంటికి వచ్చినా, అత్తగారింట్లో ఉన్నా ఆనందంగా ఉండాలి. ఇది తొలిసారి డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రకటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కానీ నేటికి ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఎంతమందికి అందాయి అంటే సరైన సమాధానం దొరకని పరిస్థితి. లబ్ధిదారులు లక్షల్లో ఉండగా కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లు మాత్రం వేలల్లో ఉన్నాయి. అవి కూడా నేటికి అర్హులకు అందని పరిస్థితి. అసలు ఇప్పటి వరకు ఎవరు అర్హులు, ఎంతమంది లబ్ధిదారులున్నారు. ఎప్పుడు ఇస్తారు. ఏ ప్రాతిపదికన ఇస్తారు అనేదానిపై ఒక స్పష్టత లేకుండా పోయింది. అసలు దరఖాస్తులు ఏ స్టేజ్ లో ఉన్నాయి. ఎవరు పర్యవేక్షిస్తున్నారు అనేది కూడా ప్రజల్లో అయోమయం నెలకొంది.

Double-Bed-Rooms2

ఇంకెంత కాలం ఈ నిరీక్షణ..

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో రూ.18.68 కోట్ల నిధులతో 216 డబుల్ బెడ్రూం ఇళ్లకు 11 నవంబర్ 2017లో శంకుస్థాపన చేశారు. ఏళ్ల తరబడి సాగిన ఈ ఇళ్ల నిర్మాణం గత ఏడాది పూర్తయింది. ఒక కరెంట్ సరఫరా మినహా మిగతా అన్ని పనులు పూర్తయ్యాయి. ప్యానల్ బోర్డ్ లు బిగించేందుకు స్తంభాల సరఫరాలో జాప్యం వల్ల ఆ ఒక్క పనిమాత్రం పెండింగ్ లో ఉంది. కానీ మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక హఫీజ్ పేట్ డివిజన్ లోని సాయినగర్ లో 8 బ్లాకులుగా నిర్మించిన 128 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. చిన్నచిన్న పనులు మినహా ఇక్కడ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ రెండు చోట్ల కూడా లబ్ధిదారులకు అందించేందుకు ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి.

వందల్లో ఇళ్లు.. వేలల్లో దరఖాస్తులు

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఒకానొక దశలో ప్రజలు మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. దరఖాస్తు చేసుకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాశారు. నగరంలో పెరిగిన భూముల ధరల నేపథ్యంలో ఎలాగూ స్థలం కొని ఇళ్లు కట్టుకోలేని వారెందరో రెండు పడకల ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 28 వేల మంది రెండు పడక గదుల ఇళ్ల కోసం అప్లై చేసుకున్నట్లు సమాచారం. కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రెండుచోట్ల కలిపి నిర్మించిన మొత్తం రెండు పడక గదుల ఇళ్ల సంఖ్య కేవలం 344 మాత్రమే. ఈ లెక్కన లబ్ధిదారులు ఎంతమందో ఇట్టే అర్థమవుతుంది. కనీసం డివిజన్ కు 50 మందికి కూడా ఈ డబుల్ బెడ్రూం ఇళ్లు దక్కే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. దేన్ని కొలమానంగా తీసుకుంటారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపోతే ఈ ఇళ్లను కూడా ఎప్పుడు ఇస్తారు. ఇంకెంత కాలం నిరీక్షించాల్సి వస్తుంది అన్నది కాలమే నిర్ణయించాలి.

Next Story

Most Viewed