ఆర్థిక వ్యవస్థలో ఓ మైలురాయి.. జీఎస్టీకి నాలుగేళ్లు

by  |
Four Years of GST
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వచ్చిన ఈ జులై 1తో 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కారణంగా ప్రజలపై పన్నుల భారం తగ్గిందని, సగటు పన్ను రేటు 11.6 శాతం మాత్రమే ఉందన్నారు. నిత్యావసర ధరలు జీఎస్టీ ముందుతో పోలిస్తే చాలావరకు తగ్గిపోయాయని చెప్పారు. ప్రధాని మోదీ సైతం భారత ఆర్థిక వృద్ధిలో జీఎస్టీ కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. నిత్యావసరాలైన సబ్బులు, టూత్‌పేస్ లాంటి వాటిపై జీఎస్టీ అంతకుముందు 29.3 శాతం ఉండగా, ఇప్పుడు 18 శాతం మాత్రమే ఉందన్నారు. గృహోపకరణాలైన ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మిక్సర్, వాటర్ హీటర్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టేలు, గ్రైండర్లు, వాక్యూమ్ క్లీనర్, టీవీలపై పన్నులు 31.3 శాతం నుంచి ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ ఉందన్నారు.

అలాగే జీఎస్టీ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో మెరుగైన లాభాలు నమోదయ్యాయని ఎరువులపై నికర పన్ను సగానికి పైగా తగ్గిందని, వ్యవసాయ పరికరాలపై పన్ను 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిందని, ఇతర వస్తువులపై పన్నులు 8 శాతం నుంచి 5 శాతానికి తగ్గినట్టు ఆర్థిక మంత్రి వివరించారు. జీఎస్టీకి ముందు ఆ తర్వాత సుమారు 400 వస్తువులు, 80 రకాల సేవలపై జీఎస్టీ రేట్లు తగ్గాయని చెప్పారు. ఇక, జీఎస్టీ కారణంగా పన్ను రేట్లు తగ్గిపోవడంతో ఇప్పటివరకు 66 కోట్లకు పైగా జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, వ్యాట్ లాంటి 17 రకాల లెవి పన్ను పన్ను కలిసినట్టు పేర్కొన్నారు. నాలుగేళ్లలో మొత్తం 44 సార్లు జీఎస్టీ మండలి సమావేశాలు నిర్వహించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story

Most Viewed