హన్మకొండలో ఒమిక్రాన్ కలకలం.. ట్రేసింగ్ సాధ్యమేనా..?

by  |
Omicron
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలోనూ వ్యాపిస్తోంది. నిత్యం కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోకి మహమ్మారి ఎంటర్ అవడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అయితే, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇప్పటి వరకు రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి వైద్యశాఖ టెస్టులు చేస్తోంది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిని మాత్రం ర్యాండమ్‌గా చెక్ చేసింది. ఈ క్రమంలోనే నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఒమిక్రాన్ నిర్ధారణ అవడంతో వైద్య శాఖ మరింత అప్రమత్తమైంది.

అయితే, ఇప్పటి వరకు హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వారిలోనే ఒమిక్రాన్ కేసులు గుర్తించబడ్డాయి. కేవలం హైదరాబాద్ సిటీకే కేసులు పరిమితమయ్యాయి అనుకున్న సమయంలో శుక్రవారం హన్మకొండలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. యూకే నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో హన్మకొండ, వరంగల్ జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే, సదరు మహిళ యూకే నుంచి వచ్చిన ఎనిమిది రోజులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. సదరు మహిళ డిసెంబర్ 3వ తేదీన యూకే నుంచి హైదరాబాద్ చేరుకోగా.. మొదటగా ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టుల్లో నెగిటివ్ అని వచ్చింది. దీంతో వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పి అధికారులు ఆమెను ఇంటికి పంపించారు.

దీంతో వారు హన్మకొండలోని సుబేదారి వద్ద ఉన్న ప్రాంతానికి వచ్చేశారు. ఈ క్రమంలో వారం రోజుల తర్వాత యూకే నుంచి వచ్చిన వారికి మరోసారి టెస్టు చేయాల్సిందిగా జిల్లా వైద్యారోగ్యశాఖకు ఎయిర్‌పోర్టు అధికారులు సమాచారం అందించడంతో ఈ నెల 12న టెస్టులు చేయగా.. సదరు మహిళకు పాజిటివ్‌గా తేలింది. దీంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. గురువారం రిజల్ట్స్‌లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అయితే వారి కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నప్పటికీ ఆమెకు మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

యూకే నుంచి వచ్చిన 15 రోజుల తర్వాత ఒమిక్రాన్ బయటపడటంతో ఇప్పటి వరకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఎవరెవరిని కలిశారో అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఒక వేళ మహిళ ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదా?. ఇంట్లోని కుటుంబసభ్యులు ఎక్కడెక్కడికి వెళ్లారని తీగ లాగుతున్నారు. ట్రేస్ చేసి ప్రతీ ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు వైద్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.

Next Story