ఏడాదవుతోంది.. ఇంకెంతగనం తిరగాలి సారూ..?

by  |
ఏడాదవుతోంది.. ఇంకెంతగనం తిరగాలి సారూ..?
X

దిశ‌, ఖ‌మ్మం: ఆసరా పింఛన్‌కు అప్లై చేసుకున్న వృద్ధులు, వికలాంగులు ఏడాదిగా ఆఫీసుల చుట్టే తిరుగుతున్నారు. అర్హ‌త ఉన్నా పింఛ‌న్ అంద‌డం లేదని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలో గతేడాది 10 వేల మందిని ఆసరా పింఛన్‌కు అర్హులుగా గుర్తించారు. కానీ, 7 వేల మందిని పక్కన పెట్టి, కేవలం 3వేల మందికే పింఛన్లు మంజూరు చేశారు. దీంతో 7 వేల మందికి ఏడాదిన్నరగా ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో 1,60,485 మంది నెల‌నెలా ప్ర‌భుత్వం నుంచి పింఛ‌న్లు అందుకుంటున్నారు. ఇందులో 57,688 మంది వృద్ధాప్య పింఛ‌న్‌దారులు కాగా విక‌లాంగులు 2 6,336 మంది ఉన్నారు. వితంతు 64,840, చేనేత కార్మికులు 457, గీత కార్మికులు 3,154 మంది, ఒంట‌రి మహిళలు 8,009, బీడీ కార్మికులు ఒకరు ఉన్నారు. ఆస‌రా పింఛ‌న్ల‌ను రూ.2,016 అంద‌జేస్తుండ‌గా, విక‌లాంగుల‌కు రూ.3,016లు అంద‌జేస్తోంది. కొత్త పింఛ‌న్ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల కాలేద‌ని, అంత వ‌ర‌కు తామేమి చేయ‌లేమ‌ని అధికారులు చేతుతెత్తేస్తున్నారు. మార్గ‌ద‌ర్శ‌కాల విడుద‌ల‌పై కూడా ఎలాంటి స్ప‌ష్ట‌త లేద‌ని అధికారులు చెబుతుండ‌టం గ‌మనార్హం.

అట‌కెక్కిన‌ వ‌య‌స్సు కుదింపు

ఆస‌రా పింఛ‌న్ల మంజూరుకు వ‌య‌స్సు అర్హ‌త‌ను 58 ఏళ్ల‌కు కుదిస్తామ‌ని 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీంతో జిల్లాకు చెందిన‌ ఎంతో మంది వృద్ధులు త‌మ‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆశ ప‌డ్డారు. 58 ఏళ్ల‌కు పైబ‌డి ఆస‌రా పింఛ‌న్లు పొందేందుకు అర్హులైన వారు 29,889 మంది ఉన్న‌ట్లు 2019 జ‌న‌వ‌రి మాసంలో అధికారులు గుర్తించి రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక పంపారు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం నేటికీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదని స్పష్టం అవుతోంది.

Next Story

Most Viewed