ఓలా యాప్‌తో ముంబై డ్రైవర్ల దందా.!

by  |
ఓలా యాప్‌తో ముంబై డ్రైవర్ల దందా.!
X

దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 1న ముంబై పోలీసులు ముగ్గురు ఓలా క్యాబ్ డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఓలా యాప్‌లో ఎక్కువ కిలోమీటర్లను కలిపి, ప్రయాణీకులు ఎక్కువ డబ్బు చెల్లించేలా ఈ డ్రైవర్లు మానిప్యులేట్ చేశారు. యాప్‌ను అప్‌డేట్ చేయకుండా అందులో వచ్చిన చిన్న టెక్నికల్ గ్లిచ్‌ను ఉపయోగించుకుని 40 మంది వరకు క్యాబ్ డ్రైవర్లు ఇలా దందా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయమై ఓలా ప్రతినిధులు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాజేశ్ ఆచార్య అనే వ్యక్తి ఈ స్కామ్‌ను కనిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అతనితో పాటు మరో ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు.

ఎలా చేశారు.?

గతంలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసిన ఆచార్య.. తాను కనిపెట్టిన ఈ ఓలా యాప్ గ్లిచ్ గురించి పోలీసులకు వివరించాడు. యాప్‌లో ఉన్న డ్రైవర్ ఇంటర్‌ఫేస్‌లో క్యాబ్ బ్రిడ్జి కింద ఉన్నా కూడా జీపీఎస్ ఆధారంగా బ్రిడ్జి పైన ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి బ్రిడ్జి కింద నుండి క్యాబ్ వెళ్లినప్పుడల్లా డ్రైవర్.. ఫోన్ ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసేవాడు. బ్రిడ్జి దాటిన తర్వాత మళ్లీ ఆన్ చేసేవాడు. ఇలా చేయడం వల్ల జీపీఎస్ ప్రకారం క్యాబ్ ఇంకా బ్రిడ్జి మీదనే ఉందని యాప్‌ అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా బ్రిడ్జి అవతలి వైపు నుంచి బుక్ చేస్తే మళ్లీ బ్రిడ్జి మీద నుంచి రెండు సార్లు తిరిగినట్టుగా యాప్ అనుకునేది. ఈ రెండు సార్లు తిరిగిన దూరాన్ని కస్టమర్ ఖాతాలో రికార్డు చేసి, దానికి తగినట్లుగా ధర పడేది. క్యాబ్ వెంటనే వచ్చినప్పటికీ ఇలా ఎక్కువ ధర పడటంతో ప్రయాణికులు మొదట ఇబ్బంది పడేవారు. దాని గురించి డ్రైవర్‌ను అడిగితే మాకేం తెలుసు.. మొత్తం యాప్ చూసుకుంటుందని చెప్పేవారు. దీంతో కస్టమర్‌లు కూడా వదిలేసేవారు. ఇలా ఈ గ్లిచ్‌కు తగినట్లుగా ఉండే మూడు, నాలుగు లొకేషన్‌లను టార్గెట్ చేసి అక్కడి నుంచే బుకింగ్‌లను యాక్సెప్ట్ చేసేవారు. ముఖ్యంగా ముంబై విమానాశ్రయం నుంచి పన్వేల్ రూట్‌లో ఎక్కువగా బ్రిడ్జి ఓవర్ పాస్‌లు ఉండటం వల్ల ఒరిజినల్‌గా ఉన్న కిలోమీటర్ల కంటే రెట్టింపు కిలోమీటర్లను యాప్ చూపించేది. దీంతో చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ ఛార్జిని ప్రయాణీకులు చెల్లించాల్సి వచ్చేది.

అంతేకాకుండా క్యాబ్ డ్రైవర్లకు ఓలా అందించే హోమ్ ఆప్షన్‌ను కూడా డ్రైవర్లు దుర్వినియోగం చేశారు. క్యాబ్ డ్రైవర్లు తమ ఇంటి లొకేషన్‌ను యాప్‌లో షేర్ చేయడం వల్ల రాత్రి చివరి ట్రిప్‌లు వాళ్ల ఇంటికి దగ్గరలో ఉన్న లొకేషన్‌లకు మాత్రమే పడేలా ఈ ఆప్షన్ పనిచేస్తుంది. దీంతో చాలా మంది డ్రైవర్లు తమ ఇంటి అడ్రస్ పన్వేల్ అని పెట్టడంతో విమానాశ్రయం నుంచి పన్వేల్ వెళ్లే ట్రిప్‌లు మాత్రమే వీరికి అందేవి. ఇలా దందా చేస్తూ ఒక్కో డ్రైవర్ లక్షల్లో సంపాదించినట్లు తెలుస్తోంది. 2019 డిసెంబర్ నుంచి ఈ దందా కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ గ్లిచ్‌ను అప్‌డేట్ చేయడానికి ఓలా యాప్ అప్‌డేట్‌లను పంపించినా.. డ్రైవర్‌లు యాప్‌ను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవకుండా సెట్టింగ్ మార్చేవారని, తద్వారా అవుట్‌డేటెడ్ యాప్‌తోనే ట్రిప్‌లు బుక్కయ్యి, ఇలా దందా కొనసాగడానికి దారి ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు.

దీని గురించి పోలీసులకు ఎలా తెలిసింది?

ఓలా డ్రైవర్లు ఇలాంటి స్కామ్ ఏదో చేస్తున్నారని పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తి సమాచారం ఇచ్చారు. దీని గురించి నిర్ధారించుకోవడానికి వారు డమ్మీ ప్రయాణీకులుగా మారి ముంబై విమానాశ్రయం నుంచి పన్వేల్‌కు క్యాబ్ బుక్ చేసుకున్నారు. అలా రెండు రోజులు కొన్ని ట్రిప్‌లు బుక్ చేసుకుని, డ్రైవర్ యాప్‌ను స్విచ్ఛాఫ్ చేయడం, రేట్లు పెరగడం గమనించారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్ వారు ముగ్గురు వ్యక్తుల మీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేశారు. ఈ దందా గురించి ఓలా తరఫు వివరణ కోసం పోలీసులు ఓలా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.

Next Story

Most Viewed