ఓలా నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్‌!

by  |
Ola company
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అనేక ప్రాంతాల్లో ట్యాక్సీ సేవలను అందిస్తున్న ఓలా సంస్థ ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సిద్ధమవుతోంది. ఇటీవల దేశీయంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి రావడం ద్వారా ఆటో పరిశ్రమలో వస్తున్న మార్పును అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ‘ఓలా ఎలక్ట్రిక్’ పేరుతో భారత్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంపై పట్టు సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా, బెంగళూరు శివార్లలో ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్‌గా ‘ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. సుమారు 500 ఎకరాల్లో ఈ నిర్మాణం ఉంటుందని, ఇది భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహన తయారీ ప్లాంట్‌గా ఉండనుందని ఆయన తెలిపారు.

ఈ ఏడాదిలోనే జూన్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేశాక తయారీ ప్రారంభించేందుకు లక్ష్యాన్ని నిర్దేశించామని, పూర్తిస్థాయిలో 2022, జూన్ కల్లా సిద్ధమయ్యేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు. ‘ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ. 15 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు, మొదటి దశ పూర్తి చేసేందుకు రూ. 2 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. అన్ని పనులు సజావుగా పూర్తయితే ఈ ఏడాదిలోనే 20 లక్షల యూనిట్ల స్కూటర్లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గనక ఏడాది కోటి యూనిట్లు లేదా ప్రపంచంలోని మొత్తం ఈ-స్కూటర్లలో 15 శాతం ఈ-స్కూటర్లను తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. అంటే ప్రతి రెండు సెకెన్లకు ఒక స్కూటర్‌ను ఓలా తయారుచేయనుంది. ఈ ఫ్యాక్టరీ పనుల కోసం 3 వేల రోబోలను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఫ్యాక్టరీ ద్వారా మొత్తం 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ చెబుతోంది.



Next Story

Most Viewed