రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఆ కేసులో ప్రియుడే హంతకుడు!

by  |
Nurse-111
X

దిశ, శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నలగండ్లలోని ఓ లాడ్జ్ లో గత శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ప్రకాశం జిల్లాకు చెందిన యువతి నాగచైతన్య(24)ది హత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. యువతితో కలిసి రూమ్ తీసుకున్న కోటిరెడ్డి అమ్మాయిని తానే హత్య చేసి గదికి తాళం వేసి అక్కడి నుంచి ఒంగోలుకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగచైతన్యను కోటిరెడ్డి నమ్మించి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మర్డర్ కేసుగా నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చందానగర్‌ సీఐ క్యాస్ట్రో తెలిపారు.

ఇదీ విషయం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె గొర్రెముంచు నాగ చైతన్య (24). నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తోంది. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్‌ రిప్రజంటెటీవ్‌గా పని చేస్తున్నాడు. తరచూ ఆస్పత్రికి వెళ్లే క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ నెల 23న ఆసుపత్రి సమీపంలోని ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్న కోటిరెడ్డి, నాగచైతన్యతో పాటే కలిసి ఉన్నారు. మరుసటి రోజు ఆదివారం రాత్రి వీరు తీసుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పరిశీలించడంతో గొంతుకోసి రక్తపు మడుగులో నాగచైతన్య మృతిచెంది ఉంది. లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. లాడ్జీ గదిని పరిశీలించగా గదిలో మద్యం సీసాలతోపాటు రక్తం మడుగును కడగడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగించిన పోలీసులు.. యువతిని కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. అతన్ని విచారించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ క్యాస్ట్రో తెలిపారు.


Next Story

Most Viewed