టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి భూ దాహం.. రాత్రికి రాత్రే బదిలీ ఉత్తర్వులు

by  |
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి భూ దాహం.. రాత్రికి రాత్రే బదిలీ ఉత్తర్వులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రైమ్ ఏరియాగా ప్రసిద్ధి పొందిన బైపాస్ రోడ్డులో సర్కారు భూమిని, తమ పేరుమీద మార్చాలని ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి సర్వేయర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గత మూడు నెలలుగా సంబంధిత భూమిని సర్వే చేసి డాక్యుమెంట్లు రూపొందించాలని సర్వేయర్లపై సదరు ప్రజాప్రతినిధి ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. అయితే, అది అసాధ్యమని తాము చేయలేమని సర్వేయర్లు చేతులెత్తేసినట్లు తెలిసింది. సంబంధిత భూమి విలువ కోట్ల రూపాయలు ఉండడంతో దానిని దక్కించుకునేందుకు ఆ లీడర్ విశ్వ ప్రయత్నాలు చేయడం గమనార్హం. సర్కారు భూమి, ప్రైవేట్ పట్టా భూమిగా చేయడం సాధ్యం కాదని గుర్తించిన సర్వేయర్లు ఈ విషయంలో ఎమ్మెల్యే చెప్పిన పెద్దగా పట్టించుకోలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆ నేత ఏకంగా రాత్రికి రాత్రే నిజామాబాద్ చుట్టు పక్కల మండలాల్లో ఉన్న సర్వేయర్లను మొత్తం మార్చివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు సర్వేయర్లకు స్థాన చలనం కల్పిస్తూ ఆదేశాలు వచ్చినా, అది రికార్డుల రూపంలో రాలేదని తెలుస్తోంది. ఈనెల 18న సర్వేయర్లను రిలీవ్ చేయాలని సంబంధిత ల్యాండ్ సర్వే ద్వారా మండల రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు వచ్చినట్లు సమాచారం. అయితే సర్వేయర్ మాత్రం తాము ఆ ఉత్తర్వులను తీసుకునేది లేదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం పోడు భూముల కార్యక్రమాన్ని ముందేసుకుని పని చేస్తుంటే, ఇక్కడ మాత్రం ప్రజాప్రతినిధులు సర్కారు భూములను కాజేసేందుకు ప్రయత్నాలు చేయడం విశేషం.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం బాగా పెరిగింది. ఇటీవల బైపాస్ వెంట నూతన కలెక్టరేట్, ఐటీ హబ్, న్యాక్ ట్రైనింగ్ సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలకు ఇప్పుడు అక్కడ ఎకరాలకొద్ది భూములు వారి బినామీల పేర్లపై రిజిష్టర్ అయి ఉన్నాయి. బినామీలను రంగంలోకి దింపి మాదవనగర్ బైపాస్ మొదలుకొని అర్సపల్లి రైల్వే గేట్ వరకు ఉన్న భూములను ఎడాపెడా కొని పారేశారు. ఖాళీగా భూమి కనపడితే చాలు ప్రజాప్రతినిధులు బినామీలతో నయానో భయానో మెప్పించి, వినకుంటే బలవంతంగా గుంజుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఓ గంజి వ్యాపారి భూమిని తక్కువ రేటుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఒక సీఐకి చెందిన భూమికి ప్రధాన రహదారికి రోడ్డు ఇవ్వమని బెదిరించి మరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది. వారసులు లేని మరో భూమిని కూడా అక్కడ కొందరు కబ్జా చేసేశారు. నిజామాబాద్ బైపాస్ ఆనుకుని ఉన్న సర్కారు భూములు అంటే ఇప్పుడు అక్కడ హాట్ కేక్‌గా మారాయి. వాటిని దక్కించుకునేందుకు రెవెన్యూ, ల్యాండ్ సర్వేయర్లపై మామూలుగా ఒత్తిడి చేయడం లేదు. ఇక్కడ విధులు నిర్వహించాలంటే తాము చెప్పినట్లే డాక్యుమెంట్లు రెడీ చేయాలని చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు కేటాయించిన భూమిలో కొద్ది భాగం మిగిలిపోవడంతో ఓ ప్రజాప్రతినిధికి బంధువు అయ్యే వ్యక్తితో పాటు మరో చోటా నాయకుడు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం బైపాస్ ఏరియాలో గుప్పు మంటుంది. మాట వింటే సరే.. లేకుంటే వేటే అన్న పరిస్థితి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది.

ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేసి మరీ సంబంధిత శాఖలపై పెత్తనం చేస్తున్నారు. అందుకు కారణమూ లేకపోలేదు. నగరంలో ప్రైమ్ ల్యాండ్ ఏరియాలో ఉన్న భూములను గుప్పిట్లో పెట్టుకునేందుకు రెవెన్యూ, ల్యాండ్ సర్వే డిపార్ట్‌మెంట్‌లపై పెత్తనం బాగా పెరిగిపోయింది. గడిచిన మూడు నెలల క్రితం నగరంలోని ఫిషరీస్ కార్యాలయం భూములను సర్వే చేసిన సర్వేయర్‌పై అధికారులు వేటు వేశారు. ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండగా దానిని ప్రైవేట్ పట్టా భూమిగా చూపడం వెనుక పెద్ద ఎత్తున ఒత్తిళ్ళు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, అక్కడ సర్వేయర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారనే వాదనలు ఉన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి పలు శాఖల్లో తిష్ట వేసిన కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు పేటెంట్‌గా మారి సర్కారు వారసులు లేని భూములను అప్పగించే బాధ్యతలను మోస్తున్నారని సర్కారు ఉద్యోగులే విమర్శలు చేస్తున్నారు. అప్పుడు సర్వేయర్ విని బలి కాగా, ఇప్పుడు ప్రభుత్వ భూములను కాపాడేందుకు తమ ఉద్యోగాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కారణం లేకుండా రాత్రికి రాత్రే ల్యాండ్ సర్వేయర్‌లను ఎందుకు బదిలీ చేశారంటే ఎవరి వద్ద సమాధానం వద్ద లేని పరిస్థితి నెలకొంది.


Next Story

Most Viewed