తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు..

by  |
NIA
X

దిశ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టులకు పేలుడు పదార్ధాలను సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఎన్ఐఏ పోలీసులు సోమవారం సోదాలు జరిపారు. మావోయిస్టు సానుభూతిపరులనే అనుమానంతో ఎనిమిది ఇళ్లల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కొన్ని పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నది. ఏక కాలంలో మహబూబ్‌నగర్, వరంగల్, జనగాం, కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న నమోదైన ఒక పాత కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించామని, మొత్తం ఎనిమిది మంది నిందితులుగా ఉంటే అందుల నలుగురు ఇప్పటికీ అజ్ఞాతజీవితంలో ఉన్నట్లు ఆ ప్రకటన వివరించింది.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముత్తు నాగరాజు, వి.సతీష్, కొత్తగూడెం జిల్లాకు చెందిన గుంజి విక్రమ్, త్రినాధరావు, మేడ్చల్ జిల్లాకు చెందిన కొమ్మరాజుల కనకయ్య, జనగాం జిల్లాకు చెందిన సూర సారయ్య, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వల్లెపు స్వామికి చెందిన నివాసాల్లో సోదాల చేశారు. వీటిలోపాటు హన్మకొండలోని వల్లెపు స్వామికి చెందిన ఇంట్లో కూడా సోదాలు చేసినట్లు ఆ ప్రకటనలో ఎన్ఐఏ వివరించింది. సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన సానుభూతిపరులుగా వీరిపై అనుమానం ఉన్నదని, ఆ పార్టీ ఫస్ట్ బెటాలియన్ (పీఎల్‌జీఏ) కమాండర్ హిడ్మాకు పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది.

ఈ సోదాల్లో 400 ఎలక్ట్రిక్ డిటొనేటర్లు, 500 నాన్-ఎలక్ట్రిక్ డిటొనేటర్లు, 400 జిలెటిన్ స్టిక్స్, 549 మీటర్ల ప్యూజు వైరు తదితరాలను ముత్తు నాగరాజు, కొమ్మరాజుల కనకయ్య నివాసాల్లో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నది. వీటితో పాటు కొన్ని మెటల్ ప్లేట్లు, ఇనుప పైపులు, పేలుడు కోసం వాడే ఇనుప బిళ్లలు, మేకుల్లాంటివి కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గ్రేనేడ్ లాంఛర్ల తయారీకి, ఇంప్రూవైజ్డ్ ఎలక్ట్రిక్ డిటొనేటర్లకు అనుసంధానించడానికి వాడే వస్తువులను, విప్లవ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.



Next Story

Most Viewed