కొవిడ్ కోరల్లో క్రీడాలోకం

by  |
కొవిడ్ కోరల్లో క్రీడాలోకం
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడిన వాళ్ల సంఖ్య కోటి దాటిపోయింది. ఈ మహమ్మారి ఎటు నుంచి ఏ రూపంలో వెంటాడుతుందో అర్థంకావడం లేదు. వైరస్ ప్రభావంతో ఆటలన్నీ స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే బయోసెక్యూర్ స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా ఆటలు ప్రారంభిద్దామనుకుంటే ఏకంగా క్రీడాకారులకే కరోనా సోకుతుండటం భయాందోళనలకు గురి చేస్తోంది. ముఖ్యంగా నాన్-కాంటాక్ట్ ఆటలాడే క్రీడాకారులకు ఈ వైరస్ సోకడం క్రీడాలోకాన్ని నివ్వెరపరుస్తోంది. క్రికెట్, టెన్నిస్‌లో పేరొందిన క్రీడాకారులే కొవిడ్ బారిన పడగా, మరోవైపు అథ్లెట్లకు సోకితే మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెప్పడం తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నది.

క్రికెట్‌లో మొదలై..

గత మూడు నెలలుగా క్రికెట్ స్తంభించిపోయింది. ఎలాగోలా తిరిగి ప్రారంభించడానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) 3టీ క్రికెట్ ఆరంభించింది. మూడు జట్లతో ఒకే మ్యాచ్ ఆడించే కొత్త ఫార్మాట్ కనిపెట్టింది. అన్నీ కలిసొస్తే శనివారమే ఈ మ్యాచ్ జరగాల్సింది. కానీ అనూహ్యంగా సీఎస్ఏలో ఏడుగురు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. అయితే, కరోనా బారిన పడింది ఆటగాళ్లా, సిబ్బందా? అనే విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు. కానీ, 3టీ మ్యాచ్‌ను మాత్రం వాయిదా వేసింది. ఇక ఇంగ్లాండ్ టూర్ వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టునూ కరోనా వెంటాడింది. పర్యటనకు వెళ్లాల్సిన 29మందిలో 10మంది క్రీడాకారులకు పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షల్లో మరో ముగ్గురు వైరస్ బారినపడటంతో చివరకు 20మంది ఆటగాళ్లు, 11మంది సిబ్బందితో పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేరుకుంది. వీరందరూ 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ప్రతి ఏడు రోజులకు పరీక్షలు చేసి, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మాత్రమే బరిలోకి దిగనున్నట్లు ఈసీబీ తెలిపింది.

టెన్నిస్‌లో కరోనా తెచ్చిన లొల్లి

టెన్నిస్ క్రీడాకారుల్లో పలువురికి కరోనా సోకడం ఆటగాళ్ల మధ్య విభేదాలకు దారి తీసింది. గతవారం జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో దిమిత్రోవ్, బోర్నా కొరిచ్‌లు తలపడ్డారు. తర్వాత చేసిన పరీక్షల్లో దిమిత్రోవ్ కరోనా బారిన పడినట్లు బహిరంగంగా ప్రకటించాడు. మరుసటి రోజు కొరిచ్‌ కూడా తనకు కొవిడ్ పాజిటివ్‌గా వచ్చినట్టు తెలిపాడు. అదే టోర్నీలో పాల్గొన్న జకోవిచ్‌కూ వైరస్ సోకినట్టు తెలిసింది. దీంతో ఆ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు, సిబ్బంది టెస్టులు చేయించుకున్నారు. కరోనా కాలంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటించకుండా కౌగిలించుకున్నారని, కరచాలనం చేశారని, సరదాగా పార్టీ చేసుకున్నట్లు వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ అనంతరం తన కొడుకుకు కావాలనే కరోనా అంటించారని జకోవిచ్ తండ్రి ఆరోపించాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. కరోనా సోకినట్లు తనకు తెలిస్తే అసలు మ్యాచ్‌కు వచ్చే వాడిని కాదని దిమిత్రోవ్ అన్నాడు. ఇది చిలికి చిలికి పెద్ద వివాదంగా మారింది. ఇద్దరు స్టార్ ప్లేయర్లు కరోనా బారిన పడటంతో త్వరలో జరగాల్సిన యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రశ్నార్థకంగా మారింది. ఆటగాళ్లే అవగాహన కల్పించాల్సిందిపోయి, ఇలా నిబంధనలు ఉల్లంఘించి ఇతరులకు కరోనా అంటించడం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది.

అథ్లెట్లకు డేంజరే

కరోనా వైరస్ సాధారణ వ్యక్తుల కంటే అథ్లెట్లకు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు జర్మనీ, ఇటలీలో చేసిన ఒక అధ్యయనంలో తేలింది. గాలి పీల్చుకోవడంలో సాధారణ వ్యక్తులకు, అథ్లెట్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అథ్లెట్లు ఎక్కువగా వ్యాయామం చేసి అలసిపోవడం వల్ల ఎక్కువ గాలి పీల్చుకుంటారని, దీంతో వీరి ఊపిరితిత్తుల్లో చాలా లోతు వరకు గాలి ప్రసరిస్తుందని అంటున్నారు. ఇలా అనేక భాగాలకు వైరస్ పాకి త్వరగా లంగ్స్ పాడయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, వ్యాయామంతో పాటు రోగ నిరోధక శక్తిని మరింతగా పెంచుకుంటే ఇలాంటి ప్రమాదాల బారినుంచి అథ్లెట్లు తప్పించుకునే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

Next Story

Most Viewed