వరంగల్ MGMకు అద‌న‌పు హంగులు

by  |
వరంగల్ MGMకు అద‌న‌పు హంగులు
X

దిశ ప్రతినిధి, వరంగల్

వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్పత్రికి మ‌రిన్ని వసతులు కల్పించారు. హైద‌రాబాద్ త‌ర్వాత అతి పెద్ద హాస్పిట‌ల్‌గా ఉన్న ఎంజీఎంలో క‌రోనా విస్తృతిని దృష్టిలో ఉంచుకుని కొత్త పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 15న తన క్యాంపు కార్యాల‌యంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశం స‌త్ఫ‌లితాలిచ్చింది. ప్ర‌జాప్ర‌తినిధులు, ఎంజీఎం వైద్యులు, అధికారులు, ప్రైవేట్ హాస్పిట‌ల్స్ ప్ర‌తినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.‌ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌తోనూ మంత్రి ఎర్ర‌బెల్లి ఫోన్‌లో మాట్లాడారు.

మంత్రి ఈట‌ల‌కు నివేదించిన 15 అంశాల్లో స‌గానికి పైగా సక్సెస్ అయ్యాయి. మిగ‌తావి సైతం త్వ‌ర‌లోనే స‌మ‌కూరనున్నాయి. మంగ‌ళ‌వారం మరోసారి మంత్రి ఎర్ర‌బెల్లి వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి నుంచి అటు హైద‌రాబాద్, ఇటు వ‌రంగ‌ల్‌లో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులతో మ‌రోసారి టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించి, ప‌రిష్కారాలు చూపిస్తే, వాటిని సాధించ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌న్నారు. కేవ‌లం 5 రోజుల వ్యవధిలో ఎంజీఎం సామ‌ర్థ్యం పెంపు, క‌రోనా వైర‌స్ కట్టడిపైనిర్వ‌హించిన స‌మావేశంలో స‌గానికి పైగా అంశాల‌ను సాధించామ‌న్నారు. ఎంజీఎంలో క‌రోనా బెడ్లు 200 మాత్ర‌మే ఉండ‌గా, అద‌‌నంగా 50 బెడ్లు పెంచామ‌న్నారు. అలాగే ఇప్పుడున్న వెంటిలేట‌ర్ల‌కు అద‌నంగా 15 వెంటిలేట‌ర్లు, 5 బై పాస్ మిష‌న్లు కూడా వ‌చ్చాయ‌న్నారు. క‌రోనా బారిన వైద్యులు, సిబ్బంది ప‌డుతున్నందున‌, అద‌నంగా 10వేల ఎన్‌-95 మాస్కులు, 4వేల పీపీఈ కిట్లను తెప్పించామ‌న్నారు.

ఇక ఎంజీఎంలో పారిశుధ్యాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించ‌డానికి వీలుగా మ‌‌రో 40మంది పారిశుధ్య కార్మికులు, 18 మంది రోగి సంర‌క్ష‌కులను నియమించినట్లు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. అద‌నంగా క్లీనిక‌ల్, మెడిక‌ల్ స్టాఫ్ ను కూడా మిగ‌తా విభాగాల నుంచి నియమించినట్లు వివ‌రించారు. క‌రోనా చికిత్స‌ కోసం 5 ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌కు అనుమ‌తుల కోసం సిఫారసులు చేశామ‌ని చెప్పారు. జ‌య‌, మాక్స్ కేర్, అజ‌రా, ఆదిత్య‌, అర‌వింద హాస్పిట‌ల్స్ క‌రోనా చికిత్స‌ల‌ను వ‌రంగ‌ల్ లోనే నిర్వ‌హించ‌డానికి ముందుకు వ‌చ్చాయ‌ని, వాటికి త్వ‌ర‌లోనే అనుమ‌తులు ల‌భిస్తాయ‌ని మంత్రి అన్నారు. ఈ టెలీ కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, రాజ్య‌స‌భ స‌భ్యుడు బండా ప్ర‌కాశ్, లోక్‌స‌భ స‌భ్యుడు ప‌సునూరి ద‌యాక‌ర్, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, కాళోజీ హెల్త్ యూనివ‌ర్సిటీ వీసీ క‌రుణాక‌ర్ రెడ్డి, వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, సీపీ ప్ర‌మోద్ కుమార్, కెఎంసీ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సంధారాణి, ఎంజీఎం సూప‌రింటెండెంట్ శ్రీ‌నివాస్, డీఎంఅండ్ హెచ్‌వో ల‌లితాదేవి పాల్గొన్నారు.


Next Story

Most Viewed