‘మార్కెట్’ కార్యాలయంలో ‘మందు సిట్టింగ్’.. మంచంపై ‘మత్తు’లో తేలుతూ..!

by  |
‘మార్కెట్’ కార్యాలయంలో ‘మందు సిట్టింగ్’.. మంచంపై ‘మత్తు’లో తేలుతూ..!
X

దిశ, నేరేడుచర్ల : రైతులు పండించిన ధాన్యం సకాలంలో అమ్ముడుపోక నానా అవస్థలు పడుతుంటే.. ఆ ధాన్యాన్ని మిల్లర్లు కొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిన మార్కెట్ కమిటీ అధికారులు మాత్రం మిల్లర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడి వారికి కొమ్ము కాస్తున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ అధికారులు నిలుస్తారనడంలో ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు గురువారం మార్కెట్ కార్యాలయాన్ని మందు దుకాణంగా మార్చేశారు. నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామ శివారులోని శ్రీ సోమశేఖర రైస్ మిల్లులో పండుగ జరిపారు. నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానం అందింది. దావత్‌లో భాగంగా మద్యం కోసం రూ. 2వేలు ఇచ్చారని మార్కెట్ కమిటీ సిబ్బంది తెలిపారు. ఆ డబ్బులతో మద్యం తీసుకువచ్చి మార్కెట్ కార్యాలయంలోనే మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎండీ గని తన తోటి సిబ్బందితో ఫుల్లుగా తాగాడు. మార్కెట్ కమిటీ కార్యదర్శి గని మద్యం ఫుల్లుగా తాగడంతో భోజనానికి కూడా వెళ్లలేని పరిస్థితి వచ్చింది.

దీంతో మార్కెట్ కార్యాలయం వెనుక భాగంలో కార్యదర్శి గని మంచంలో స్పృహ కూడా లేకుండా పడిపోయారు. ఈ అధికారి విధుల్లో ఉన్న సమయంలో కూడా మద్యం తాగి కార్యాలయానికి వస్తున్నాడని పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ధాన్యం అమ్ముడుపోక రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ రైతులు నానా కష్టాలు పడుతుంటే ఆ ధాన్యాన్ని రైతులు ఎలా అమ్మాలనే దానిపై మార్కెట్ కమిటీ పలు సూచనలు చేయాల్సి ఉండగా.. ఆ అధికారి మాత్రం తమకేమీ పట్టనట్టుగా మిల్లర్ల పక్కనచేరాడు. అంతేకాకుండా డ్యూటీ సమయంలో మద్యం తాగి కార్యాలయం వెనుక పడుకోవడాన్ని చూసి పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయమై మార్కెట్ కమిటీ జిల్లా అధికారి సంతోష్‌ను ఫోన్ చేసి వివరణ కోరగా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని తెలిపారు.



Next Story

Most Viewed