వర్క్ టూ హోం !

by  |
వర్క్ టూ హోం !
X

దిశ, న్యూస్ బ్యూరో: అవును..మీరు చదివింది నిజమే..‘వర్క్ టూ హోం!’..నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో పలు కంపెనీలు తమ క్లయింట్ల పనులు ఆగిపోకుండా ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. కంపెనీలకు, ఉద్యోగులకు నష్టం లేదు. కానీ, అనాదిగా వస్తున్న వృత్తినే నమ్ముకున్నవారు, చిన్నచిన్న పనులు చేసుకుంటున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పేద నాయిబ్రాహ్మణులు హైదరాబాద్ సిటీలో కనిపెట్టిన మార్గమే..‘వర్క్ టూ హోం’..

ఇంటి వద్దకే వెళ్లి..

లాక్‌డౌన్ ప్రకటించి 35 రోజులు దాటింది. లాక్ డౌన్‌తో సెలూన్లు మూతపడ్డాయి. పలువురు పెరిగిన గడ్డాలు, జుట్టుతో వీడీయోలు, ఫొటోలు దిగుతూ ఆనందం పొందుతున్నారు. కానీ, క్షురవృత్తిని నమ్ముకున్న వారికి మాత్రం ఇల్లు గడవడం రోజురోజుకూ కష్టమవుతోంది. దీంతో ఇంటి వద్దకే వెళ్లి హెయిర్ కటింగ్ చేస్తున్నారు. సెలూన్లు మంచిగా నడిచినపుడు రోజుకు రూ.1,000 పైగానే సంపాదించి, కుటుంబాన్ని పోషించేవారు. లాక్ డౌన్‌తో ఆ సంపాదన ఆగిపోయింది. అయితే, లాక్‌డౌన్ ప్రారంభంలో కొందరు నాయీబ్రాహ్మణులు ఈ విధంగానే ఇండ్లల్లకు వెళ్లి కటింగ్ చేశారు. అలా చేయొద్దనీ, కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండటంతో పనులు ఆపేయాలని కుల సంఘాలు హెచ్చరించాయి. దీంతో వృత్తిదారులు వెనక్కి తగ్గారు. కానీ, రానురాను ఇండ్లల్లో పరిస్థితి దుర్భరంగా తయారైంది. కనీసం పాలు, కూరగాయలకు సైతం చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. దీంతో రహస్యంగా ఇండ్లళ్లకు వెళ్లి కటింగ్ చేస్తూ
కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

కుటుంబం గడిచేందుకు..

సెలూన్‌కు రెగ్యులర్‌గా ఉండే కస్టమర్లు పెరిగిన గడ్డాలతో, జుట్టుతో చిరాకు పడుతున్న వారు ఫోన్లు చేసి నాయీబ్రాహ్మణులను ఇండ్లకు పిలిపించుకుంటున్నారు. అయితే, ప్రభుత్వాలు, కుల సంఘాలు వృత్తి చేయొద్దని చెప్పిన మాట నిజమే కానీ, ఇల్లు గడిచే పరిస్థితిలేదని చెబుతూ కొందరు కస్టమర్ల వద్దకే వెళ్లి కటింగ్ చేస్తున్నారు. ‘‘కులవృత్తినే నమ్ముకున్నోళ్లం.. అది చేస్తేనే ఇప్పుడు మా కుటుంబం గడుస్తుందని’’ ఎల్‌బీ‌నగర్‌కు చెందిన వృత్తిదారుడు మచ్చగిరి చెబుతున్నారు. సంఘానికి తెలియకుండా పనిచేస్తున్నాననీ, తన కడుపు కొట్టొద్దంటూ వేడుకుంటున్నాడు.

Tags: Lockdown, Nayibrahmin, saloon, trouble, work to home, saloon, difficulties


Next Story

Most Viewed