న‌యీం ఫ్యామిలీ ఎక్కడ‌ ?

by  |
న‌యీం ఫ్యామిలీ ఎక్కడ‌ ?
X

దిశ, న‌ల్లగొండ‌ :
బినామీ ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నయీమొద్దీన్‌ (నయీం) కుటుంబ సభ్యులు ఇన్‌కంట్యాక్స్ అధికారుల‌కు చిక్కడం లేదు. వారు అందుబాటులో లేకపోవడంతో భువనగిరి పట్టణంలోని ఖాజా మహల్లాలో గల నయీం నివాస భవనానికి ఐటీ శాఖ అధికారులు ఇటీవ‌లే ఫైన‌ల్ నోటీసులు అంటించి వెళ్లారు. గ‌త నెల 26న హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే న‌యీం కుటుంబ సభ్యులెవరరూ విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో మ‌రోసారి నయూం అనుచ‌రుడైన పాశం శ్రీ‌నుకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఆయ‌న కూడా భువ‌న‌గిరిలో లేక‌పోవ‌డంతో నోటీసులు ఇంటికి అంటించి వెళ్లారు. దీంతో నయీం ఫ్యామిలీ ఎక్కడుందనే విషయం మరోసారి చర్చనీయాంశం కాగా..వారితో ప్రమాదం పొంచి ఉన్న బాధితుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.

ఐటీ అధికారుల‌కు చుక్కలు..

వేల కోట్ల అవినీతి సొమ్మును పోగేసిన నయీం..పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమైనా..ఆ కథ అంతటితో ముగియలేదు. అతడి అవినీతి సామ్రాజ్యపు లెక్కలు తేల్చేందుకు సిట్ – ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు రూ. 20 వేల కోట్లు కూడబెట్టాడన్న ప్రచారం నేపథ్యంలో నయీం కుటుంబసభ్యుల నుంచి ఆ ఆస్తుల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే క్రిమినల్ మైండ్‌తో ఉన్న నయీం కుటుంబ సభ్యులు ఆ అవినీతి లెక్కలు చూపకుండా ఐటీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

న‌యీం చచ్చి సాధిస్తుండ‌ట‌!

నయీం కుటుంబ సభ్యుల పేర 97 ఆస్తులు ఉన్నట్టుగా ఆదాయపు పన్ను శాఖాధికారులు సెప్టెంబ‌ర్‌ 2017లో గుర్తించారు. తల్లి తాహేరా బేగం, అక్క సలీమా బేగం, మొదటి భార్య హసీనా బేగం, మరో భార్య అహేలా బేగం, సమీప కుటుంబ సభ్యురాలు హీనా కౌసర్‌ పేర్లపై ఈ 97 ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించిన లావాదేవీల వివరాలను అందించాలని లావాదేవీల నిషేధ చట్టం 1988 సెక్షన్‌ 23 కింద ఆదాయపు పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ బ్రిజేంద్ర కుమార్ నోటీసులు జారీ చేశారు. అయితే సదరు నోటీసులిచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఐటీ అధికారులకు చిక్కకుండా నయీం కుటుంబ సభ్యులు తప్పించుకు తిరుగుతున్నారు. న‌యీం భార్య, తల్లి, సోదరిలకు ఐటీ శాఖ ఇప్పటికే 9 సార్లు నోటీసులు జారీ చేసి, దాదాపు రూ. 1000 కోట్ల లావాదేవీలకు సంబంధించి వివరణ కోరిందని తెలుస్తోంది. ఇక లాభం లేదనుకున్న ఐటీ అధికారులు తాజాగా నయీం అనుచరుడు పాశం శ్రీనుకు నోటీసులు ఇచ్చారు. బతికున్నపుడు పోలీసులను సాధించిన నయీం..చచ్చాక కూడా ఐటీ అధికారులను సాధిస్తున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐటీ అధికారులు షాక్‌..!

మ‌రోసారి భూ దందా కేసులో జైలుకు పోయి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన నయీం ఫ్యామిలీని.. ఐటీ అధికారులు ప‌ట్టుకోవ‌డంతో 2019 నవంబ‌ర్‌లో న‌యీం భార్య హ‌సీనా ఐటీ శాఖ ఎదుట విచార‌ణ‌కు హ‌జ‌ర‌య్యారు. తాను క‌ష్టప‌డి టైల‌రింగ్ చేసి రూ. వెయ్యి కోట్ల ఆస్తులు కూడబెట్టిన‌ట్టు చెప్పడంతో ఇన్‌కంట్యాక్స్ అధికారులు షాక్‌కు గుర‌య్యారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన త‌రువాత ఆస్తుల వారీగా ఒక్కొక్కదానిపై గుచ్చి గుచ్చి అడిగిన‌ప్పటికీ ఆమె అదే స‌మాధానం చెప్పడంతో విసుగు చెందిన ఐటీ అధికారులు విచార‌ణ‌ను వాయిదా వేశారు. ఆ త‌రువాత హాసీనా విచార‌ణ‌కు రాలేద‌ని తెలుస్తోంది.

మేన‌కోడ‌లు మృతి త‌రువాత‌..

న‌యీం నేర సామ్రజ్యంలో ఆయ‌న సోద‌రితో పాటు కీలకంగా వ్యవహరించిన అతడి మేన‌కోడ‌లు న‌ల్లగొండ శివారులో కారు ప్రమాదానికి గురై మృతి చెందింది. అప్పటి నుంచి న‌యీం కుటుంబ స‌భ్యులు ఎక్కుడుంటున్నదీ తెలియ‌డం లేదు. పోలీసుల వ‌ద్ద కూడా వారి అడ్రస్ లేక‌పోవ‌డంతో ఐటీ నోటీసులు మ‌రోసారి న‌యీం ఇంటికి అంటించిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా నయీం కుడిభుజం, క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుడు ‘శేష‌న్న’ ఆచూకీని సైతం పోలీసులు ఇప్పటి వ‌ర‌కు క‌నుక్కోలేక‌పోయారు. ఈ పరిణామాలన్నీ నయీం బాధితుల‌ ఆందోళ‌న‌కు కారణమవుతున్నాయి.

Tags: Nayeem, Bhongir, followers, IT officer, Encounter

Next Story

Most Viewed