Zelensky: యుద్ధంలో భారత్ మా వైపే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

by B.Srinivas |

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో భారత్ తమవైపే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.

Zelensky: యుద్ధంలో భారత్ మా వైపే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో భారత్ తమవైపే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) అన్నారు. రష్యా చమురు కొనుగోలుపై భారత్ తన విధానాన్ని మార్చుకుంటుందని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా జెలెన్ స్కీ ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రష్యా, భారత్ మధ్య జరిగిన ఇంధన ఒప్పందాలలో కొన్ని సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఇండియా త్వరలోనే తన వైఖరిని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ చాలా వరకు మావైపే ఉందని, ఇంధన రంగంలో కొన్ని సమస్యలున్నా వాటిని పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

యూరప్ భారత్‌తో బలమైన సంబంధాలు ఏర్పర్చుకోవాలని, భారత్ నుంచి దూరం కాకూడదని నొక్కి చెప్పారు. దూరం కాకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండగా రష్యా చమురును కొనుగోలు చేస్తూ యుద్ధానికి చైనా, భారత్‌లు నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆరోపించారు. రెండు దేశాలు రష్యా చమురు కొనుగోళ్లను నిరంతరం పెంచుతున్నాయని ఫైర్ అయ్యారు. ఈ వాదనలకు భిన్నంగా జెలెన్ స్కీ వ్యాఖ్యానించడం గమనార్హం.

Next Story