మీరే పార్టీకి వెన్నెముక..కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ సందేశం

by Dishanational2 |
మీరే పార్టీకి వెన్నెముక..కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలకు సందేశం పంపారు. ఈ మేరకు రాహుల్ మాట్లాడిన ఓ వీడియో సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో గురువారం పోస్టు చేసింది. ‘కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి వెన్నెముక, డీఎన్ఏ. పార్టీ సిద్దాంతాలను అర్ధం చేసుకుని ప్రతి రోజూ పోరాడుతున్నారు. మీరు లేకుండా మేము ఏమీ చేయలేము. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ ధ్వంసమవుతుంటే వాటిని రక్షించేందుకు వీధుల్లో, గ్రామాల్లో నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరే అసలైన రాజ్యాంగ రక్షకులు’అని తెలిపారు.

‘2024లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో దేశ ప్రజల ఆలోచనలను పొందుపర్చడానికి కాంగ్రెస్ శ్రేణులు ఎంతో సహాయం చేశారు. మీరంటే మాకెంతో అభిమానం. అందరం కలిసి ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, వారి భావజాలాన్ని ఓడించబోతున్నాం’ అని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు భారతదేశ ఆలోచనలకు వ్యతిరేకమని విమర్శించారు. అంతకుముందు మరొక పోస్టులో ‘కాంగ్రెస్ లక్ష్యం నీరు, అడవులు, భూమిని రక్షించడమే కాదు, ఆధునిక భారతదేశ నిర్మాణంలో గిరిజనుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం కూడా. గిరిజన సమాజానికి అంకితం చేసిన తీర్మానాలు వారి హక్కులకు రక్షణ కవచంలా ఉంటాయి. వనరుల దోపిడీని అరికట్టినప్పుడే దేశం బలపడుతుంది’ అని పేర్కొన్నారు.

Next Story