ఈ సవాళ్లను ‘ఇండియా’ కూటమి అధిగమించేనా?

by Dishanational2 |
ఈ సవాళ్లను ‘ఇండియా’ కూటమి అధిగమించేనా?
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా) కూటమిని ఏర్పాటు చేశాయి. ఇందులో 29 పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఇటీవలే ఈ కూటమి పగ్గాలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కూటమి దూకుడుగా వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం కూటమిలో భాగస్వామ్యమైన మిత్ర పక్షాలన్నింటితో సీట్ల షేరింగ్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సుమారు వారం రోజుల నుంచి ఈ డిస్కషన్ నడుస్తున్నప్పటికీ ఏ రాష్ట్రంలో ఎవరు పోటీ చేస్తారు? ఎన్నీ సీట్లలో పోటీ చేస్తారు? భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్య కుదిరిందా లేదా అన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. మరోవైపు జేడీయూ చీఫ్ నితీశ్ కమార్‌కు కూటమి పదవి ఆఫర్ చేయగా ఆయన తిరస్కరించారు. ఇటీవల జరిగిన వర్చువల్ భేటీకి తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరుకాలేదు. అంతేగాక మహారాష్ట్రలో సీట్ల షేరింగ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ..కాంగ్రెస్ కీలక నేత మిలింద్ డియోరా రిజైన్ చేశారు. అలాగే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 13 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ తాజాగా ప్రకటించారు. దీంతో ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే ‘ఇండియా’లో చిన్న పాటి విభేదాలు తలెత్తినట్టు అర్థం అవుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ముందున్న ప్రస్తుత సవాళ్లు ఎంటో? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అంతుచిక్కని జేడీయూ అంతరార్థం

ఇండియా కూటమి పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్. దేశమంతా ప్రతిపక్షాలను ఐక్యం చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరితోనూ చర్చలు జరిపారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం జేడీయూ సైలెంట్ అయింది. కూటమి కన్వీనర్ పదవిని సైతం నితీశ్ తిరస్కరించారు. దీంతో అసలు జేడీయూ ఏం ఆశిస్తోంది, బిహార్‌లో ఎన్ని సీట్లు కోరుకుంటుంది, అలాగే బిహార్‌లో అధికారంలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీకి ఎటువంటి చాన్స్ ఇస్తుందనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే కూటమిలోని మిత్రపక్షాలే నితీశ్‌ను పక్కనబెట్టాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బిహార్‌లో సీట్ల పంపకం విషయంలో ఏం జరుగుతుందోననే సందేహం నెలకొంది. 40 లోక్ సభ సీట్లు ఉన్న రాష్ట్రంలో ఇండియా కూటమి ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే ప్రమాదం తప్పదని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బెంగా‌ల్‌లో సద్దుబాటు అయ్యేనా!

42 పార్లమెంటు స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి సీఎం మమతా బెనర్జీపై మాటి మాటికీ విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు మమతా బెనర్జీ మాట్లాడుతూ పొత్తులు కేవలం జాతీయ స్థాయిలోనే ఉంటాయని, రాష్ట్ర స్థాయిలో ఉండబోవని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇండియా కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్టు కనిపించాయి.అయితే కాంగ్రెస్ అధిష్టానం దీదీతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది, అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఎంసీ మధ్య మాటల పోరు నడుస్తూనే ఉంది. దీంతో బెంగాల్ లో సీట్ల షేరింగ్ విషయంలో ఇరు పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయోననే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇండియా కూటమి ముందున్న అతిపెద్ద సవాల్ ఇదేనని చర్చ సర్వత్రా నడుస్తోంది. మరి కూటమి ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.

యూపీ, మహారాష్ట్రలో

దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో అత్యధిక స్థానాలున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. ఈ రాష్ట్రంలో 48 ఎంపీ సీట్లు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో పట్టు సాధించాల్సిన అవసం ఇండియా కూటమికి ఎంతో ఉంది. యూపీలో ప్రధానంగా కాంగ్రెస్, ఎస్పీ మాత్రమే భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. కానీ ఇటీవల వర్చువల్ మీటింగ్‌కి ఎస్పీ చీఫ్ అఖిలేష్ హాజరుకాకపోవడం, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లపై క్లారిటీ ఇవ్వక పోవడంతో అఖిలేశ్ అసంతృప్తితో ఉన్నాడు. అంతేగాక ఇండియా కూటమిపైనే పలుమార్లు విరుచుకు పడ్డాడు. కాబట్టి కాంగ్రెస్, ఎస్పీ మధ్య విభేదాలు నెలకొన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. అయినప్పటికీ సీట్ల పంపకం విషయంలో సయోధ్య కుదిరితే యూపీ మీద పట్టు సాధించొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్‌లు మహా వికాస్ అఘాడీ కూటమిగా ఉన్నాయి. అంతేగాక ఇవి ఇండియా కూటమిలోనూ భాగస్వామిగా ఉన్నారు. రాష్ట్రంలో కొన్ని సీట్లపై శివసేన పట్టు వీడటం లేదు. అవి మాకు కంచుకోటగా ఉన్నాయని వాటిని వదులు కోలేమని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత డియోరా సైతం దీనిపై అసంతృప్తితో ఇటీవల కాంగ్రెస్‌ను వీడారు. ఎన్సీపీ సీట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ఈ క్రమంలో సీట్ల షేరింగ్ ఏ విధంగా చేస్తారో చూడాల్సిందే.

సరైన ప్రణాళికేదీ?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆరాటమే తప్ప అందుకు తగ్గ కార్యాచరణ, ప్రణాళిక కూటమి వద్ద లేదని విశ్లేషకులు వాపోతున్నారు. సుమారు 5 నుంచి ఆరు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అందులో పక్కా ప్లానింగ్ రూపొందించలేదు. సీట్ల షేరింగ్ కొలిక్కి వచ్చాక ప్రచారంలో దూసుకు పోతామని కూటమి నేతలు చెబుతున్నప్పటికీ.. సీట్ల పంపకం విషయంలోనూ వేగంగా చర్చలు జరపడం లేదు. సీట్ల సర్దుబాటుకు జరుగుతున్న డిస్కషన్స్ ను అధికారికంగా ప్రకటించచం లేదు. కాబట్టి సీట్ల పంపకం, ప్రచార షెడ్యూల్ త్వరలో డిసైడ్ చేయాలని లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Next Story