Vikram misry: చైనాకు విక్రమ్ మిస్రీ.. కీలక అంశాలపై చర్చించే చాన్స్!

by B.Srinivas |

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram misry) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం చైనా చేరుకున్నారు.

Vikram misry:  చైనాకు విక్రమ్ మిస్రీ.. కీలక అంశాలపై చర్చించే చాన్స్!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram misry) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం చైనా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా ప్రతినిధులతో భేటీ కానున్నారు. సరిహద్దు సహా అనేక అంశాలపై చర్చించనున్నారు. తొలి రోజు ఆయన పాలక కమ్యూనిస్ట్ పార్టీ అంతర్జాతీయ విభాగం అధిపతి లియు జియాంచావోతో సమావేశమయ్యారు. ఇరు పక్షాలు అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చలు, సంబంధాల మెరుగుదల మొదలైన వాటిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అంతేగాక అభివృద్ధి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నట్టు సమాచారం. విక్రమ్‌ మిస్రీ పర్యటనను స్వాగతిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ తెలిపారు. 2024 అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగించేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోడీలు అంగీకరించారని గుర్తు చేశారు. కాగా, 45 రోజుల వ్యవధిలో భారత్ నుంచి చైనాకు అత్యున్నత స్థాయి పర్యటన జరగడం ఇది రెండోసారి. గతంలో జాతీయ భద్రతా సలహాదారు( ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ డ్రాగన్‌ను సందర్శించి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు.

Next Story