బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరిక

by Yella Dhawani Reddy |

వాణిజ్య సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కఠిన వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే.

బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: వాణిజ్య సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కఠిన వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిక్స్ (BRICS) కూటమిపై మరోసారి విమర్శలు గుప్పించారు. బ్రిక్స్‌ను ఒక చిన్న గ్రూప్‌గా అభివర్ణించిన ట్రంప్‌, తమ దేశ డాలర్‌ ఆధిపత్యాన్ని సవాల్‌ చేయాలనుకుంటే ఆ దేశాలు 10 శాతం అదనపు సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన ‘జీనియస్‌’ బిల్లుపై సంతకం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్‌ మాట్లాడుతూ.. 'బ్రిక్స్‌ అనే ఓ చిన్న గ్రూప్‌ ఉంది. వారు డాలర్‌ ఆధిపత్యాన్ని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. మా కరెన్సీ విలువను తగ్గించాలని చూస్తున్నారు. అందుకే మేము వారిపై టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. అది వేగంగా తన ప్రభావాన్ని కోల్పోతోంది. మేము వారిపై బలంగా చర్యలు తీసుకున్నాం' అని అన్నారు. అంతేకాకుండా, అమెరికా డాలర్‌కి ఉన్న గ్లోబల్‌ రిజర్వ్‌ కరెన్సీ హోదాను కాపాడతామని, దాని విలువ తగ్గితే దాన్ని ఓటమిగా భావిస్తామని స్పష్టం చేశారు.

కాగా, బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో ఏర్పడిన బ్రిక్స్‌ కూటమిలో ఇటీవల ఇరాన్‌, ఈజిప్ట్‌, ఇథియోపియా, యూఏఈ, ఇండోనేసియా దేశాలు కూడా చేరాయి. వీటిని కలిపి బ్రిక్స్‌ ప్లస్‌గా పిలుస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో అమెరికా వాణిజ్య విధానాలపై ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అమెరికా వ్యతిరేక వైఖరి కలిగిన దేశాలపై అదనపు 10% సుంకాలు విధిస్తామని, బ్రిక్స్‌ దేశాలపై టారిఫ్‌లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Next Story