స్మార్ట్ ఫోన్లలో శాటిలైట్ లొకేషన్స్ ఆన్ చేయాల్సిందే.. ఫోన్ కంపెనీలకు కేంద్రం మరో ప్రతిపాదన?

by Prasad Jukanti |

సంచార్ సాథీ యాప్ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం తాజాగా లొకేషన్ విషయంలో కీలక ప్రతిపాదన చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

స్మార్ట్ ఫోన్లలో శాటిలైట్ లొకేషన్స్ ఆన్ చేయాల్సిందే.. ఫోన్ కంపెనీలకు కేంద్రం మరో ప్రతిపాదన?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app) విషయంలో చెలరేగిన వివాదం చల్లారక ముందే కేంద్ర ప్రభుత్వం (Government of India proposal) మొబైల్ ఫోన్ల విషయంలో మరో సంచలన నిర్ణయం దిశగా ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇకపై మొబైల్ లొకేషన్ ఎప్పటికీ ఆన్‍లో (mobile location tracking) ఉంచేలా కేంద్రం మరో ప్రయత్నం చేస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు హాట్ టాపిక్ గా మారాయి. శాటిలైట్ లొకేషన్ ట్రాకింగ్‍ను ఎనేబుల్ చేయాలని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు ప్రతిపాదించేందుకు టెలికాం శాఖ సిద్ధమైనట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశంలో ప్రభుత్వ ప్రతిపాదనను వినియోగదారుల గోప్యత, భద్రతా సమస్యకు దారి తీయవచ్చనే కారణంతో ఆపిల్, గూగుల్, శాంసంగ్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఆంగ్ల మీడియా పేర్కొంది.

మెరుగైన నిఘా కోసం నేరుగా శాటిలైట్ లొకేషన్ ట్రాకింగ్‍ను (satellite location tracking) ఎనేబుల్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయా కేసుల దర్యాప్తుల సమయంలో టెలికాం సంస్థలకు చట్టపరమైన అభ్యర్థనలు చేసినప్పుడు దర్యాప్తు ఏజెన్సీలు ఖచ్చితమైన స్థానాలు పొందడం లేదు. ప్రస్తుతం సెల్యులార్ టవర్ డేటా ద్వారా అంచనా వేసిన లొకేషన్ మాత్రమే పొందే వీలుంది. ఇది వాస్తవ లొకేషన్ కంటే అనే మీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది. దీని స్థానంలో ఉపగ్రహ సంకేతాలు, సెల్యులార్ డేటాను ఉపయోగించే A-GPS టెక్నాలజీని యాక్టివేట్ చేయాలని స్మార్ట్ ఫోన్ తయారీదారులను కేంద్రం ఆదేశించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా సైబర్‌ నేరాల నుంచి రక్షణ, చోరీకి గురైన ఫోన్లను గుర్తించేందుకు వీలుగా ఇకపై కొత్తగా విక్రయించే ఫోన్లలో డిఫాల్ట్ గా సంచార్ సాథీ యాప్‍ను ఫోన్ తయారీ కంపెనీలే ఇన్ స్టాల్ చేయాలని నవంబరు 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఆదేశాలపై విపక్షాలతో పాటు సాంకేతిక నిపుణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పౌరుల కాల్స్‌ను వినడానికి, ఎస్సెమ్మెస్‌లను చూడటానికే ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు, వ్యక్తిగత గోప్యత కోసం పోరాడేవారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ యాప్ పై కేంద్రం వెనక్కి తగ్గింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో తాజాగా శాటిలైట్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ను ఎనేబుల్‌ చేయాలని స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు ప్రతిపాదించేందుకు టెలికాం శాఖ సిద్ధమైనట్లు ప్రచారం హాట్ టాపిక్‍గా మారింది.

Next Story