సెల్ ఫోన్ కోసం 21 ల‌క్షల లీట‌ర్ల వాటర్ వేస్ట్.. అధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్

by Disha Web Desk 19 |
సెల్ ఫోన్ కోసం 21 ల‌క్షల లీట‌ర్ల వాటర్ వేస్ట్.. అధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసలే ఎండాకాలం. కనీసం తాగునీరు దొరక్కా ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ బాధ్యత గల ప్రభుత్వ పదవిలో ఉన్న ఓ అధికారి మతిలేని చర్యకు పాల్పడ్డాడు. తన స్మార్ట్‌ఫోన్ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డింద‌ని.. ఆ ఫోన్‌ను తీసేందుకు సుమారు 21 ల‌క్షల లీట‌ర్ల నీటిని తోడించారు. పంట పొలాల అవసరాల కోసం నిల్వ చేసిన నీటిని వృథా చేశారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలోని కొయాలిబేడా బ్లాక్‌లో చోటుచేసుకుంది. కంకేర్ జిల్లాలోని ఖేర్‌క‌ట్టా రిజర్వాయర్ వద్దకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ విశ్వాస్ త‌న మిత్రుల‌తో క‌లిసి గత ఆదివారం పిక్నిక్‌కు వెళ్లారు.

అయితే సెల్ఫీ దిగుతున్న స‌మ‌యంలో ఫోన్ ఆ డ్యామ్‌లో ప‌డింది. రూ.96 వేల విలువైన ఆ ఫోన్‌లో విలువైన డేటా ఉంద‌న్న కారణంతో తొలుత ఫోన్ కోసం ఈతగాళ్లతో అన్వేషించే ప్రయ‌త్నం చేశారు. కానీ ఆ ప్రయ‌త్నంలో స‌క్సెస్ కాక‌పోవ‌డంతో, నీటిని తోడేయాల‌ని ప్రయత్నించారు. 15 అడుగుల లోతైన ఆ డ్యామ్ నుంచి 30 హెచ్‌పీ డీజిల్ పంపుల‌తో సోమవారం నుంచి గురువారం వరకు 21 ల‌క్షల లీట‌ర్ల నీటిని తోడించేశారు. కానీ ఫోన్ దొరక్కపోవడంతో మూడు రోజుల పాటు గాలింపులు చర్యలు చేపట్టించాడు. 41,104 క్యూబిక్ మీటర్ల నీళ్లు వృథాగా పోయాయి. ఆ నీరు ఉండుంటే 1,500 ఎకరాలకు ఉపయోగపడేవి. చివరకు మూడు రోజులకు ఫోన్ దొరికింది.

అయితే అప్పటికి అది వర్కింగ్ కండిషన్‌లో లేదు. తాను చేసిన పనిని రాజేశ్ విశ్వాస్ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ‘పంప్ చేసింది నీటిపారుదలకి పనికిరాని మురుగునీరు. నా వ్యక్తిగత మొబైల్ కావడం, అందులో ముఖ్యమైన కాంటాక్ట్స్ ఉన్నందున రికవరీ కోసం ప్రయత్నం చేశాం. 3-4 అడుగుల లోతు వరకు నీటిని ఖాళీ చేయడానికి కంకేర్ నీటిపారుదల శాఖ ద్వారా మౌఖిక అనుమతి తీసుకున్నా’ అని చెప్పుకొచ్చారు. ‘నీటి పారుదలకి పనికిరాని వ్యర్థ జలాలను ఉంచే ఆనకట్టలోని భాగం ఇది. డీజిల్ పంపుతో నీరు ఖాళీ చేశాం. దీని ఖర్చు రూ.7,000-8,000 మాత్రమే. నీళ్లు తోడటం వల్ల ఏ ఒక్క రైతు కూడా నష్టపోలేదు’ అని చెప్పడం గమనార్హం. విషయం వెలుగులోకి రావడంతో రాజేశ్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.



Next Story

Most Viewed