క్యాన్సర్ చికిత్సకు రూ. 100 ట్యాబ్లెట్ కనుగొన్న టాటా వైద్యులు

by Dishanational1 |
క్యాన్సర్ చికిత్సకు రూ. 100 ట్యాబ్లెట్ కనుగొన్న టాటా వైద్యులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ ప్రధాన క్యాన్సర్ పరిశోధనా, చికిత్సా కేంద్రం టాటా ఇన్‌స్టిట్యూట్ రెండోసారి రాకుండా కేన్సర్‌ను నిరోధించే చికిత్సను కనుగొన్నట్టు పేర్కొంది. దీనికోసం ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు, వైద్యులు 10 ఏళ్లు పనిచేశారని, ఇప్పుడు వారు ఒక ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేశారని పరిశోధనా బృందం తెలిపింది. ఇది రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50 శాతం తగ్గించగలదని వారు పేర్కొన్నారు. 'పరిశోధన కోసం ఎలుకల్లో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. ఇది వాటిలో కణతిని ఏర్పరుస్తుంది. అప్పుడు ఎలుకలు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స చేస్తారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు, అవి క్రోమాటిన్ కణాలుగా పిలువబడే చిన్న ముక్కలుగా విరిగిపోతాయని కనుగొనబడింది. ఈ కణాలు రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించగలవు. ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశించినప్పుడు అవి క్యాన్సర్‌గా మారుతుందని ' పరిశోధనా బృందంలోని భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు.

టాటా వారి పరిశోధనలో మరణిస్తున్న క్యాన్సర్ కణాలు సెల్-ఫ్రీ క్రోమాటిన్ కణాలను విడుదల చేస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కణాలను క్యాన్సర్‌గా మారుస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్(R+Cu) కలిగిన ప్రో-ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారని బద్వె చెప్పారు. ఇవి క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తాయి. టాటా వైద్యులు దాదాపు దశాబ్దం పాటు ఈ ట్యాబ్లెట్‌పై పనిచేశారు. ప్రస్తుతం ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. ఆమోదం తర్వాత జూన్-జూలై నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడంలో ఈ ట్యాబ్లెట్ చాలావరకు సహాయపడుతుందని సీనియర్ క్యాన్సర్ సర్జర్ చెప్పారు. చికిత్స కోసం లక్షల నుంచి కోట్ల వరకు ఖర్చు అవుతుంది, కానీ ఈ ట్యాబ్లెట్ కేవలం రూ. 100కి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.


Next Story