సినిమా టికెట్ల ధరలు, ఖర్చుపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు

by Malleboina Mahesh |

ఒక సినిమా చూడటానికి సాధారణ ప్రజలు ₹1,500 నుండి ₹2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు సినిమాలు చూడటానికి ధియేటర్లకు రారు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

సినిమా టికెట్ల ధరలు, ఖర్చుపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా టికెట్ల ధరల పెంపుపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో సినిమా టికెట్ల ధరను ₹200కు పరిమితం చేస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. దీనిపై కర్ణాటక మల్టీ ఫ్లెక్స్ థియోటర్ల ఓనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారిస్తున్న సమయంలో సినిమా టికెట్ల ధరల పెంపుపై దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. టికెట్ ధరలతో పాటు ధియేటర్లలో విక్రయించే తినుబండారాలపై భారీగా వసూలు చేస్తున్న మొత్తాలను సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

“ప్రస్తుతం ఒక సినిమా చూడటానికి సాధారణ ప్రజలు ₹1,500 నుండి ₹2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు సినిమాలు చూడటానికి ధియేటర్లకు రారు” అని కోర్టు వ్యాఖ్యానించింది. సినిమా టికెట్ రేట్లు, ఫుడ్ ధరలను నియంత్రించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ధియేటర్లలో బటర్ పాప్‌కార్న్, కోల్డ్ డ్రింక్స్, స్నాక్స్‌ల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తుండటంపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్‌లలో తినుబండారాల ధరలపై వినియోగదారులు గతంలో పిటిషన్లు వేసిన సందర్భాలు ఉన్నాయి.

ఆ సమయంలో బాంబే హైకోర్టు కూడా “సినిమా హాళ్లు బ్లాక్ మార్కెట్‌లా మారకూడదు, ప్రజల సౌకర్యం దృష్ట్యా తగిన నియంత్రణ ఉండాలి” అని వ్యాఖ్యానించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా సినిమా టికెట్ ధరలపై గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఏపీలో టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి, తర్వాత క్రమంగా అనుమతించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా రాష్ట్రాలు సమగ్రమైన విధానం తీసుకురావాలని కోర్టు సూచించడం గమనార్హం.

Next Story