శివసేన(యూబీటీ)కి బీజేపీతో శత్రుత్వం లేదు: ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

by Dishanational2 |
శివసేన(యూబీటీ)కి బీజేపీతో శత్రుత్వం లేదు: ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేనకు ఎప్పుడూ బీజేపీతో శత్రుత్వం లేదన్నారు. తమ పార్టీ ఇప్పటికీ కాషాయ పార్టీతోనే ఉందని కానీ వారే మమ్మల్ని దూరం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. సింధుదుర్గ్ జిల్లాలోని సావంత్‌వాడిలో జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ మాట్లాడారు. ‘మేము ఎప్పటికీ మోడీకి శత్రువులం కాదు. శివసేన(యూబీటీ) బీజేపీ వెంటే ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రచారం చేశాం. వినాయక్ రౌత్ వంటి మా ఎంపీలు ఎన్నికైనందునే మోడీ ప్రధాని అయ్యారు. కానీ ఆ తర్వాత మమ్మల్ని విడిచిపెట్టారు’ అని వ్యాఖ్యానించారు. ‘హిందూత్వం, కాషాయం జెండా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ కాషాయ జెండాను చింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని విమర్శించారు. బీజేపీ దేశానికి ఏదైనా చేసుంటే ఇతర రాజకీయ పార్టీలను చీల్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దానికోసం ఈడీ, సీబీఐలను ప్రయోగించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేయడం ద్వారా రాష్ట్ర బీజేపీ బలహీనపడిందని దీనిని ప్రధాని మోడీ అర్థం చేసుకోవాలని సూచించారు. కాగా, ప్రతిపక్షాల ఇండియా కూటమిలో శివసేన(యూబీటీ) భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Next Story

Most Viewed