సీఏ పరీక్షల తేదీ మార్చాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

by Dishanational1 |
సీఏ పరీక్షల తేదీ మార్చాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మేలో జరగాల్సిన చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షలకు సంబంధించిన కొన్ని పేపర్‌లను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. పోలింగ్ రోజు ఎలాంటి పరీక్షను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహించట్లేదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు మే 7, 13 తేదీల్లో జరుగుతాయని, మే 6, మే 12 తేదీల్లో ఎలాంటి పరీక్షను షెడ్యూల్ చేయలేదని పేర్కొంది. పరీక్షల తేదీలను మార్చడం వల్ల వాటి నిర్వహణ కోసం ఇప్పటికే జరిగిన విస్తృత ఏర్పాట్లకు విఘాతం ఏర్పడుతుందని, దానివల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్షల షెడ్యూల్ విధానపరమైన నిర్ణయాలకు సంబంధిచ్నినదని, కాబట్టి పిల్‌ను తరస్కరిస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. 'కానీ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను మేము పరీక్షలకు హాజరయ్యే, ఓటు వేయాల్సిన అభ్యర్థుల విషయాన్ని పరిశీలించాము. 591 కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ తేదీలలో పరీక్షలు లేవు. 4 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్న ఈ దశలో, తేదీల మార్పు తీవ్రమైన విఘాతానికి దారి తీస్తుంది' అని సీజేఐ అన్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో(ఏప్రిల్ 8న) ఢిల్లీ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేయగా, ఇదే కారణంతో కోర్టు తిరస్కరించింది.

Next Story