ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీకి సమర్పించిన ఎస్‌బీఐ

by Dishanational1 |
ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీకి సమర్పించిన ఎస్‌బీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్ల వ్యవహరంలో సుప్రీంకోర్టు ఆగ్రహంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దిగొచ్చింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎలక్టోరల్ బాండ్ల డేటాను కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం సమర్పించింది. భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా శుక్రవారం(మార్చి 15) సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. అయితే, బ్యాంకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నారని ధృవీకరించే అఫిడవిట్‌ను ఇంకా దాఖలు చేయలేదు. ఇది సిద్ధంగానే ఉందని, బుధవారం అందజేయనున్నట్టు సమాచారం. ఎన్నికల బాండ్ల వివరాలు ఇచ్చేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న ఎస్‌బీఐ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 11న జరిపిన విచారణ సందర్భంగా, ఎస్‌బీఐ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. సమాచారం అందుబాటులో ఉన్నా సరే ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ బ్యాంకు పిటిషన్‌ను కోట్టివేసింది. ఈ క్రమంలోనే మంగళవారానికి డేటా ఇవ్వాలని స్పష్టం చేసింది. 2018లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల స్కీమ్ కింద ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సుమారు 28 వేల బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. వీటి విలువ రూ. 16,518 కోట్లు.



Next Story

Most Viewed