కోర్టుకు హాజరుకాని శశికళ.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

by Disha Web Desk 1 |
కోర్టుకు హాజరుకాని శశికళ.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ విచారణకు హాజరు కాకపోవడంతో బెంగళూరులోని ప్రత్యేక లోకాయుక్త కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బెంగుళూరులోని జైలులో ఆమె నిర్బంధంలో ఉన్న సమయంలో ఆమెకు వీఐపి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. 2017 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ నగరంలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.

మరో నిందితుడు శశికళ కోడలు ఇళవరసికి కూడా కోర్టు ఎన్‌బిడబ్ల్యూ జారీ చేసింది. ఎఐఏడీఎంకే మాజీ నాయకుడికి ష్యూరిటీలు అందించిన ఇద్దరు వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు సోమవారం విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. జయలలిత, మిగతా వారిపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించి నాలుగేళ్లు గడిచింది. పరప్పన సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో ఖైదీలకు ఇవ్వని అధికారాలు, ప్రత్యేక ట్రీట్ మెంట్ పొందేందుకు జైలు అధికారులకు ఆమె లంచం ఇచ్చినట్లు వారు ఆరోపించారు.

ఈ ఏడాది మేలో, కర్ణాటక హైకోర్టు శశికళతో పాటు నిందితులుగా ఉన్న ముగ్గురు జైలు అధికారులపై కేసును కొట్టి వేసింది. అప్పటి చీఫ్ జైలు సూపరింటెండెంట్ కృష్ణ కుమార్, అప్పటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైళ్ల డాక్టర్ అనిత, అప్పటి ఇన్స్పెక్టర్ గజరాజ మకనూర్ 2017 ఫిబ్రవరి 15న శశికళ జైలు వచ్చిన నాటి నుంచి ఆమెకు సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ముగ్గురిపై ఉన్నాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ శశికళ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే, లోకాయుక్త కోర్టులో ఆమెపై విచారణపై హైకోర్టు స్టే విధించలేదు. ఇది ఇలా ఉండగా, సోమవారం జరగాల్సిన విచారణకు శశికళ ప్రత్యేక కోర్టుకు హాజరు కాలేదు. ఆమె పదే పదే గైర్హాజరీ అవుతున్న కారణంగా సీరియస్ అయిన కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Next Story

Most Viewed