ఈవీఎం-వీవీప్యాట్ కేసు.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు

by Gopi |
ఈవీఎం-వీవీప్యాట్ కేసు.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను పోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరపున న్యాయవాది నేహా రాఠీ వేసిన రివ్యూ దాఖలు చేశారు. దాని ప్రకారం, ఏప్రిల్ 26న కోర్టు ఇచ్చిన తీర్పులో సింబల్ లోడింగ్ యూనిట్ల(ఎస్ఎల్‌యూ) నిర్వహణ, వాటి ఆడిట్ అవసరాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్‌యూలో అవసరమైన గుర్తులకు మించి అదనపు డేటా ఉండే అవకాశాన్ని కోర్టు విస్మరించిందని పిటిషనర్ అరుణ్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఓటర్లు తమ ఓటు ఖచ్చితంగా నమోదైందని ధృవీకరించుకోవడానికి అనుమతించవని పిటిషనర్ తెలిపారు. అంతేకాకుండా, ఈవీఎంలు డిజైనర్లు, ప్రోగ్రామర్లు, తయారీదారులు, నిర్వహణ సాంకేతిక నిపుణులు వంటి వారి చేతిలో మార్పులకు గురయ్యే అవకాశం ఉంది. వీవీప్యాట్‌లతో ఈవీఎంలపై పోలైన ఓట్లను 100 శాతం క్రాస్ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లను ఏప్రిల్ 26న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల మొత్తం ప్రక్రియను ప్రశ్నార్థకం చేస్తూ, భయాందోళనలు, ఊహాగానాలు రేకెత్తించడానికి సుప్రీంకోర్టు అనుమతించదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.

Next Story