ఢిల్లీ ప్రజలకు ఊరట: ఆ ప్రాంతంలో తగ్గిన ఉష్ణోగ్రత..కారణమిదే?

by Dishanational2 |
ఢిల్లీ ప్రజలకు ఊరట: ఆ ప్రాంతంలో తగ్గిన ఉష్ణోగ్రత..కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. మరిన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 25.5, 11.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతకుముందు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఊరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది.ఈ మేరకు హెచ్చరికను సైతం జారీ చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు రాజధాని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధిక కాలుష్యం, ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బంది పడుతున్న రాజధాని ప్రాంత ప్రజలకు వాతావరణం చల్లబడటంతో కాస్త ఊరట లభించినట్టు అయింది.

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం

ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వర్షాలు కురుస్తుండగా..హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం భారీగా హిమపాతం నమోదైంది. లాహౌల్, స్పితి, కిన్నౌర్, కులు, చంబా జిల్లాల్లోని ఎత్తైన ప్రాంతాలలో హిమపాతం సంభవించినట్టు అధికారులు తెలిపారు. అటల్ టన్నెల్‌తో సహా కులు ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. దీంతో ట్రాఫిక్ కుు అంతరాయం కలిగింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా.. చంబా జిల్లాలోని టిస్సాలో అత్యధికంగా 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ స్కీయింగ్ రిసార్ట్‌తో సహా ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి నాలుగో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్ స్కీయింగ్ రిసార్ట్‌లో గత 24 గంటల్లో మంచుకురిసినట్టు తెలిపారు.



Next Story

Most Viewed