ముందస్తు ప్రణాళికతోనే రామనవమి అల్లర్లు: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్

by Dishanational2 |
ముందస్తు ప్రణాళికతోనే రామనవమి అల్లర్లు: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో రామనవమి నాడు జరిగిన అల్లర్లు బీజేపీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ హింసను ప్రేరేపించిందని మండిపడ్డారు. రాయ్ గంజ్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ‘రామనవమి అల్లర్లు అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఎందుకంటే పండుగకు ఒకరోజు ముందు డీఐజీని తొలగించారు. తద్వారా బీజేపీ హింసకు పాల్పడి ఉండొచ్చు అనే అనుమానం కలుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచగొట్టి ఓట్లు పొందాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. కాగా, రామ నవమి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో రెండు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా..18 మంది గాయపడ్డారు.

మరోవైపు అల్లర్లకు సీఎం మమతా బెనర్జీనే కారణమని బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారి ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మమతా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ద్వారా హింసను ప్రేరేపించిందని చెప్పారు.అలాగే శాంతియుతంగా సాగుతున్న పాదయాత్రపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు దాడి చేశారని మరో బీజేపీ నాయకుడు సుకాంత మజుందార్ తెలిపారు. మైనారిటీ ఓట్లను ఏకం చేసేందుకు మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు.

Next Story