ఎన్నికల వేళ కాంగ్రెస్‌‌కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేత..?

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ కాంగ్రెస్‌‌కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేత..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ సీఎంతో గత కొంత కాలంగా విభేదిస్తున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తన విషయంలో అధిష్టానం తీరుపై ఆగ్రహంతో రగలిపోతున్న పైలట్.. ఇక సొంత పార్టీ పెట్టుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ మేరకు తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి రోజైన జూన్ 11న దౌసాలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజున భారీ ర్యాలీ నిర్వహిస్తారని.. అనంతరం కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ పేరును సైతం ఖరారు చేశారని.. ‘ప్రగతిశీల కాంగ్రెస్’ పేరుతో పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రచారం గుప్పుమంటోంది.

2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి పైలట్‌కు సీఎం అశోక్ గెహ్లాట్ మధ్య అధికార పోరు కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్, పైలట్‌ల మధ్య పంచాయతీ పార్టీకి నష్టం కలిగిస్తుందని భావించిన అధిష్టానం గత నెలలో ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి పార్టీ కోసం పని చేస్తారని అధిష్టానం అనౌన్స్ చేసింది. కానీ పైలట్ మాత్రం అశోక్ గెహ్లోత్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని.. ఇక తన దారి తాను చూసుకోక తప్పదనే నిర్ణయంతో కొత్త పార్టీకి ప్రణాళికలు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దీని కోసమే పైలట్ తన అనుకూల వర్గంతో చర్చలు సైతం జరుపుతున్నారనే ఊహాగాలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ ఆలోచన వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ పని చేస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే కొత్త పార్టీపై సచిన్ పైలట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రచారం జరుగుతున్నట్లుగా పైలట్ కొత్త పార్టీని ప్రకటిస్తే ఆయన వెంట వెళ్లేదెవరు ఆయన నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి కలగబోయే డ్యామేజ్ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed