రాహుల్ ప్లీజ్ ఆ ఆలయానికి వెళ్లకు: అసోం సీఎం బిస్వ శర్మ విజ్ఞప్తి

by Dishanational2 |
రాహుల్ ప్లీజ్ ఆ ఆలయానికి వెళ్లకు: అసోం సీఎం బిస్వ శర్మ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో సోమవారం జరిగే భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు. బటద్రవలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సన్యాసి, సామాజిక-మత సంస్కర్త శ్రీమంత శంకర దేశ జన్మస్థలాన్ని రామమందిర కార్యక్రమం రోజున సందర్శించొద్దని తెలిపారు. గౌహతిలో ఆదివారం బిస్వ శర్మ మీడియాతో మాట్లాడారు. ‘రామాలయ ప్రతిష్టాపన సందర్భంగా ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న బటద్రవను సందర్శించొద్దు. ఇది అసోంకు మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రాణ ప్రతిష్ట తర్వాత ఆలయానికి వెళ్లొచ్చని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర జరిగే మోరిగావ్, జాగీరోడ్, నెల్లి వంటి ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే చాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలకు సోమవారం అసోం ప్రభుత్వం సెలవు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కాగా, అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా రాహుల్ బటద్రవ సత్రాన్ని సందర్శించి ప్రార్థనలు చేయనున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed