ప్రజలు, వారి సమస్యల నుంచి దూరమైన ప్రధాని మోడీ

by Dishanational1 |
ప్రజలు, వారి సమస్యల నుంచి దూరమైన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజలు, వారి సమస్యలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా దూరమయ్యారని కాంగెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. మోడీ అన్ని అధికారాలను అనుభవిస్తున్నారని, ఆయన చుట్టూ ఉన్నవారు ఆయనకు నిజం చెప్పడానికి కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం రాజస్థాన్‌లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు, జలోర్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి వైభవ్ గెహ్లాట్‌కు మద్దతుగా పాల్గొన్న ర్యాలీ మాట్లాడిన ప్రియాంక గాంధీ వాద్రా.. 'ప్రజల అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం. మోడీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కువ అధికారం ఉన్నప్పుడు ప్రజలు నిజ చెప్పరు. అధికారులు, చుట్టూ ఉన్నవారు వాస్తవాలను చెప్పేందుకూ భయపడతారు. ఆపైన ఆ వ్యక్తిని ప్రజలు తొలగిస్తారని' తెలిపారు. 'మోడీ ఇప్పుడు ప్రజల నుంచి పూర్తిగా దూరమైనట్టు కనిపిస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న రెండు అతిపెద్ద సమస్యలు. కానీ వాటి గురించి వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. భారత్‌లో జీ20 సమ్మిట్ లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మేము గర్వపడతాం. అయితే, వాస్తవానికి పేద ప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, యువత నిరుద్యోగం గురించి బాధపడుతున్నారని' ప్రియాంకా గాంధీ వెల్లడించారు. అధికార బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం లేదు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలనుకుంటొందని పేర్కొన్నారు.

Next Story

Most Viewed