కేరళ ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు

by Malleboina Mahesh |

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పలితాల్లో బీజేపీ, ఎన్‌డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని తిరువనంతపురం కార్పోరేషన్ లో బీజేపీ 50 స్థానాల్లో గెలిచింది.

కేరళ ప్రజలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పలితాల్లో బీజేపీ, ఎన్‌డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని తిరువనంతపురం కార్పోరేషన్ లో బీజేపీ 50 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో బీజేపీకి, ఎన్డేయేకి ఓటు వేసిన ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, రాష్ట్రంలో తాము సాధించిన విజయాన్ని 'చారిత్రక మలుపు'గా అభివర్ణించారు. కేరళ ప్రజలు ఎల్‌డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) కూటముల పాలనతో విసిగిపోయారని, సుపరిపాలన అందించగల, అందరికీ అవకాశాలతో కూడిన 'వికసిత కేరళం' (Vikasita Keralam)ను నిర్మించగల ఏకైక ఎంపికగా ఎన్‌డీఏను చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

తిరువనంతపురం విజయం కీలక మలుపు

ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ-ఎన్‌డీఏ సాధించిన విజయాన్ని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విజయం కేరళ రాజకీయాల్లో ఒక 'చారిత్రక మలుపు' (watershed moment) అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను తమ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. ఈ శక్తివంతమైన నగరం (తిరువనంతపురం) వృద్ధికి కృషి చేయడంతో పాటు, ప్రజల 'ఈజ్ ఆఫ్ లివింగ్' (జీవన సౌలభ్యం)ను పెంచడానికి తమ పార్టీ అంకితభావంతో పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

కార్యకర్తల కృషికి అభినందనలు

ఈ అద్భుతమైన ఫలితాలను సాధించడంలో కీలకపాత్ర పోషించిన బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తిరువనంతపురం కార్పొరేషన్‌లో అద్భుతమైన విజయం సాధించేలా కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు తన కృతజ్ఞతలను తెలియజేశారు. నేడు వచ్చిన ఈ ఫలితం, కేరళలో తరతరాలుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన, పోరాడిన బీజేపీ కార్యకర్తలందరి త్యాగాల, శ్రమ ఫలితమేనని మోడీ కొనియాడారు. తమ కార్యకర్తలే పార్టీకి బలం అని, వారి గురించి గర్విస్తున్నామని ప్రధాని తమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story