నవంబర్ 1న భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రాస్-బోర్డర్ రైల్వే ప్రాజెక్టు ప్రారంభం!

by Disha Web Desk 10 |
నవంబర్ 1న భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రాస్-బోర్డర్ రైల్వే ప్రాజెక్టు ప్రారంభం!
X

న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యాన్ని పెంచే కీలక క్రాస్-బోర్డర్ రైల్వే ప్రాజెక్టు బుధవారం(నవంబర్ 1) ప్రారంభం కానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని సోమవారం అధికారులు ప్రకటించారు. రెండు పొరుగు దేశాల ప్రధానులు అగర్తల-అఖౌరా క్రాస్ బోర్డర్ రైలు ప్రాజెక్టును ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 15 కిలోమీటర్ల ఈ కొత్త రైలు మార్గం భారత్‌లో 5 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లో 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సరిహద్దు వాణిజ్యాన్ని పెంచుతుందని, ఢాకా మీదుగా అగర్తల, కోల్‌కతాల మధ్య ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు తెలిపారు. ఈ మార్గం ఒక పెద్ద వంతెన, మూడు చిన్న వంతెన్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం రైలులో అగర్తల నుంచి కోల్‌కతా చేరుకునేందుకు దాదాపు 31 గంటల సమయం పడుతోంది. కొత్త రైలు మార్గం ద్వారా ఇది కేవలం 10 గంటలకు తగ్గుతుందని ఓ అధికారి వివరించారు. ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసేందుకు భారతీయ రైల్వే రూ. 153.84 కోట్ల బడెజెట్‌ను కేటాయించిందని అధికారి పేర్కొన్నారు.

Next Story

Most Viewed