మా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి: ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ

by Disha Web Desk 17 |
మా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి: ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ
X

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మధ్య తొలి శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. వీటిలో ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడుల అంశం చర్చకు వచ్చింది. ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం, ఇండో-పసిఫిక్‌ భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకోవడం వంటి అంశాలు కూడా ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులు జరగడం పలువురిని ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో సమ్మిట్ చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు రావడం విశేషం. ఈ చర్చల అనంతరం క్రీడలు, ఆవిష్కరణలు, ఆడియో-విజువల్ ప్రొడక్షన్, సౌర విద్యుత్ రంగలలో సహకారం వంటి నాలుగు ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ సమావేశంలో ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-భద్రత, ఖనిజాలు, వలసలు, విద్య, సంస్కృతి, క్రీడలలో సహకారాన్ని పెంపొందించడంపై ఇరు దేశాల నేతలు ప్రధానంగా చర్చించారు.

సమావేశం అనంతరం ప్రధాని కార్యాలయం మీడియా ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని వారాలుగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులకు సంబంధించిన వార్తలు రావడం విచారకరమని, ఇలాంటి వార్తలు భారతదేశంలోని ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తోందని మోడీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడులకు సంబంధించిన వార్తలు గత కొన్ని వారాలుగా క్రమం తప్పకుండా వస్తుండటం విచారకరం. ఇటువంటి వార్తలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మనస్సులను కలవరపెడుతున్నాయి. ఈ భావాలను, ఆందోళనలను ఆసీస్ ప్రధాని అల్బనీస్‌కు తెలియజేశాను. భారతీయ సమాజ భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆయన నాకు హామీ ఇచ్చారు’ అని ప్రధాని ఆ ప్రకటనలో చెప్పారు.

భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని (సీఈసీఏ) వీలైనంత త్వరగా ముగించేందుకు తమ మధ్య అంగీకారం కుదిరినట్టు అల్బానీస్ తెలిపారు. ఈ ఏడాదే దీనిని పూర్తి చేయగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన సంగలి తెలిసిందే. గత సంవత్సరమే భారత్, ఆస్ట్రేలియా ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందాన్ని (ఈసీటీఏ) ఖరారు చేశాయి. గత డిసెంబర్‌లోనే ఇది అమల్లోకి వచ్చింది.

అయితే ప్రస్తుతం ఈ రెండు దేశాలు సీఈసీఏ దిశగా పనిచేస్తున్నాయి. భారత్-ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ద్వైపాక్షిక భద్రతా సహకారం మూల స్తంభమని మోడీ అన్నారు. ‘ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, పరస్పర రక్షణ, భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించాం’ అని మోడీ అన్నారు.

అంటే ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో చైనా చర్యలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ‘రక్షణ రంగంలో మిలిటరీ లాజిస్టిక్స్ మద్దతుతో సహా అనేకమైన ఒప్పందాలు చేసుకున్నాం. మా భద్రతా ఏజెన్సీల మధ్య క్రమబద్దమైన, ఉపయోగకరమైన సమాచార మార్పిడి కూడా ఉంది. దీనిని మరింత బలోపేతం చేసుకోవాలని కూడా మేము చర్చించుకున్నాం’ అని మోడీ వెల్లడించారు.


Next Story