రామభక్తులను మాత్రమే ఆహ్వానించాం..ఉద్ధవ్‌‌కు అయోధ్య ప్రధాన పూజారి కౌంటర్

by Hajipasha |
రామభక్తులను మాత్రమే ఆహ్వానించాం..ఉద్ధవ్‌‌కు అయోధ్య ప్రధాన పూజారి కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో : తనకు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందలేదని శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ థాక్రే చేసిన వ్యాఖ్యలపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్‌ స్పందించారు. రామ భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయంటూ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రాముడి పేరుతో ప్రధాని మోడీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పడం పూర్తిగా అవాస్తవం. మోడీ హయాంలోనే రామమందిర నిర్మాణానికి ఎంతో కృషి జరిగిందన్నది వాస్తవం. ఇది రాజకీయం కాదు. మోడీకి ఉన్న భక్తి. దేశం కోసం కూడా ప్రధాని ఎంతో కృషి చేస్తున్నారు’’ అని ఆచార్య సత్యేంద్ర దాస్‌ పేర్కొన్నారు.

సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలపై భగ్గు

రాముడిని లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ నిలబెడుతుందనే శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలపైనా ఆయన మండిపడ్డారు. ‘‘సంజయ్‌ రౌత్‌కు చాలా బాధ కలుగుతున్నట్లుంది. రాముడి పేరు చెప్పి ఎన్నికల్లో వాళ్లు పోటీ చేసేవారు. అటువంటి వారు అనుచిత వ్యాఖ్యలతో ఇప్పుడు శ్రీరాముడిని అవమానిస్తున్నారు’’ అని ఆచార్య సత్యేంద్ర దాస్‌ విమర్శించారు. రాముడి పేరు చెప్పుకుని ప్రతిపక్షంలోని కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాముడ్ని నమ్మినవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని చెప్పారు.

Next Story

Most Viewed