E20 పెట్రోల్‌తో వాహనదారులు బెంబేలు.. ఆ వాహనాల్లో భారీగా మైలేజ్ డ్రాప్

by Kema Shiva Kumar |

దేశ వ్యాప్తంగా E20 పెట్రోల్ వాడుతున్న తరుణంలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి.

E20 పెట్రోల్‌తో వాహనదారులు బెంబేలు.. ఆ వాహనాల్లో భారీగా మైలేజ్ డ్రాప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంధన దిగుమతుల తగ్గింపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ వాహనదారులకు లేని కష్టాలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా 2023 ఏప్రిల్‌కు ముందు కొనుగోలు చేసిన పాత వాహనాలపై ఇథనాలు కలిపిన పెట్రోల్ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. E20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల్లో మైలేజ్ దారుణంగా పడిపోవడమే కాకుండా, ఇంజిన్ సమస్యలు కూడా తలెత్తుతున్నట్లుగా వాహనదారులు వాపోతున్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు 9 నెలలుగా తమ వాహనాల మైలేజ్ స్పష్టంగా తగ్గిపోయిందని చెబుతున్నారు. 2023 కంటే ముందు తయారైన వాహనాలు ఈ E20 ఇంధనానికి అనుకూలంగా (Compliant) లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్ సమస్యలు

అయితే, E20 పెట్రోల్ వల్ల మైలేజ్ తగ్గడమే కాకుండా, ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల తమ వాహనాలు సాంకేతిక సమస్యల బారిన పడుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజిన్ (Engine), ఫ్యూయల్ ట్యాంక్ (Fuel Tank), ఫ్యూయల్ పైప్‌లైన్‌లలో రస్ట్, ఇతర లీకేజీ సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తెలిపారు. ఇథనాల్‌కు తేమను ఆకర్షించే గుణం ఎక్కువగా ఉండటం వల్లే పాత వెహికల్స్‌లోని మెటల్, రబ్బర్ పార్ట్స్ త్వరగా పాడై వాహనదారులు తమ దగ్గరకు రిపైర్‌కు వస్తున్నట్లుగా మెకానిక్‌లు చెబుతున్నారు.

మరోవైపు E20 ఇంధనం వాడకం వల్ల సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే మైలేజ్ కేవలం 1 శాతం నుంచి 6 శాతం మాత్రమే తగ్గుతుందని ఆటోమొబైల్ పరీక్షా సంస్థల అధికారులు చెబుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాహనదారులు లబోదిబోమంటున్నారు. రియాల్టీలో మైలేజ్ డ్రాప్ 15 నుండి 20 శాతం వరకు ఉంటోందని, రోజువారీ ఆఫీసులకు, ప్రయాణాలకు పెట్రోల్ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ సరఫరా వేగంగా పెరుగుతున్న తరుణంలో పాత వాహనాలు వారు ఇంధన భారం, రిపేర్ ఖర్చులు రెండూ తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story