- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణాలకు తెగించి బిడ్డలను కాపాడుకున్న తల్లి.. నెట్టింట వైరల్గా మారిన బిహార్ రైల్వే స్టేషన్ ఘటన
రైలు పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా రైలు రావడంతో, తన ఇద్దరు పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. తన దేహాన్ని అడ్డుపెట్టి బిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన ఆ తల్లి సాహసం, అదే సమయంలో వారు చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా రైలు రావడంతో, తన ఇద్దరు పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. తన దేహాన్ని అడ్డుపెట్టి బిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన ఆ తల్లి సాహసం, అదే సమయంలో వారు చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. షాపూర్ పటోరి (Shahpur Patori) రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం.. కొందరు మహిళలు, ఇద్దరు పిల్లలతో కలిసి షార్ట్కట్లో రైల్వే ట్రాక్ దాటుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఓ రైలు వేగంగా దూసుకురావడంతో వారు తప్పించుకునే దారిలేక ట్రాక్ మధ్యలోనే చిక్కుకుపోయారు. రైలు వచ్చేస్తుండటంతో క్షణాల్లో అప్రమత్తమైన ఓ మహిళ, ప్లాట్ఫారమ్ కింద ఉన్న అంచు (మల్హారా) వద్ద పిల్లలను కూర్చోబెట్టి, తాను వారిపై పడుకుని రక్షణగా నిలిచింది. రైలు అత్యంత వేగంగా ఆమెను రాసుకుంటూ వెళ్లినట్లు వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక దశలో ఆమె రైలు వేగానికి లాగబడేంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడగా.. పక్కనే ఉన్న మరో మహిళ ఆమెను గట్టిగా పట్టుకుని కాపాడింది. రైలు వెళ్లిపోయిన వెంటనే ప్లాట్ఫారమ్ పై ఉన్న ప్రయాణికులు పరుగెత్తుకువచ్చి వారిని పైకి లాగారు. ఈ ప్రమాదకర ఘటనలో ఆ తల్లికి గాయాలైనప్పటికీ, అదృష్టవశాత్తూ పిల్లలతో సహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
‘ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నది ఎందుకు?’
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించకుండా నేరుగా ట్రాక్లు దాటడంపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు ఆ తల్లి ప్రేమని మెచ్చుకుంటుంటే, అత్యధిక శాతం మంది వారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించింది ఇందుకే. కేవలం రెండు నిమిషాల సమయం ఆదా చేసుకోవడం కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎప్పుడూ సరైనది కాదు. అదే సమయంలో ఈ ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే శాఖ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తల్లి ప్రేమకు, ధైర్యానికి ఎవరూ సాటిలేరు.. కొంత మంది నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.
రైల్వే అధికారుల హెచ్చరికలు..
సమయం ఆదా చేసుకోవడం కోసం ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వే ట్రాక్లను నేరుగా దాటవద్దని, ప్రాణాల భద్రత కోసం కేవలం ‘ఫుట్ ఓవర్ బ్రిడ్జి’లను మాత్రమే వినియోగించాలని రైల్వే అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్వే ప్రాంగణాల్లో జరిగే అత్యధిక ప్రమాదాలకు, మరణాలకు ‘ట్రాక్ క్రాసింగ్’ ప్రధాన కారణమని వారు హెచ్చరిస్తున్నారు.






