స్ట్రాంగ్ రూమ్ వద్దే 4 గంటల పాటు మమత బెనర్జీ.. రాత్రికి రాత్రే అసలు ఏం జరిగింది..?

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 04:40:30  IST  )

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలతో మమతా బెనర్జీ సంచలనం సృష్టించారు.

స్ట్రాంగ్ రూమ్ వద్దే 4 గంటల పాటు మమత బెనర్జీ.. రాత్రికి రాత్రే అసలు ఏం జరిగింది..?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు కోల్‌కతా (Kolkata)లో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఆరోపణ నేపథ్యంలో గురువారం రాత్రి సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) స్వయంగా రంగంలోకి దిగి స్ట్రాంగ్‌రూమ్ వద్ద నిరసన చేపట్టారు. భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలను భద్రపరిచిన శాఖావత్ మెమోరియల్ స్కూల్ స్ట్రాంగ్‌రూమ్ వద్ద మమతా బెనర్జీ సుమారు 4 గంటల పాటు గడిపారు. గురువారం రాత్రి ఆలస్యంగా అక్కడికి చేరుకున్న ఆమె, అభ్యర్థి హోదాలో లోపలికి వెళ్లి అర్థరాత్రి 12:07 గంటల వరకు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.

కేంద్ర బలగాలతో వాగ్వాదం..

తొలుత కేంద్ర బలగాలు తనను లోపలికి అనుమతించలేదని, ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థిగా వెళ్లే హక్కు తనకు ఉందని చెప్పడంతో అనుమతించారని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈవీఎంలను మార్చేందుకు లేదా కంప్యూటర్లలో డేటాను తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అదేవిధంగా ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రం వద్ద బయటి వ్యక్తులు బాలట్ పేపర్లతో తారుమారు చేస్తున్నట్లుగా సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోందని టీఎంసీ నేతలు కునాల్ ఘోష్ (Kunal Ghosh), శశి పంజా (Shashi Panja) తెలిపారు. దీంతో ఫలితాల రోజు వరకు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద 24 గంటల పాటు నిఘా ఉంచాలని మమతా బెనర్జీ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీ, ఈసీ రెస్పాన్స్ ఇదే..

మమతా బెనర్జీ ఓడిపోతానన్న భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) విమర్శించారు. ఆమె అక్కడ ఉన్నంతసేపు తన ఏజెంట్ ఆమెను గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టివేసింది. సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తున్నది పోస్టల్ బ్యాలెట్ల విభజన ప్రక్రియ అని, ఇది ముందస్తు సమాచారంతోనే జరుగుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మే 4న వెలువడనున్న ఫలితాల నేపథ్యంలో బెంగాల్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.

Next Story