కేరళలో పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు

by Dishanational1 |
కేరళలో పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జెండర్ ఆడిట్ నిర్వహిస్తామని, పురుషులతో సమానంగా మహిళలకు వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురువారం రాష్ట్రంలోని మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన విజయన్.. ఉద్యోగ పరిస్థితులు మహిళలకు మరింత అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. 'ఇప్పటివరకు మహిళలకు విద్య అందించడానికే ప్రాధాన్యత ఉండేది. ఇక నుంచి వారిని ఉద్యోగ జీవితంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ఉద్యోగాలు మహిళలకు అనుకులంగా ఉండేలా చూడాలి. అందుకోసం పని ప్రదేశాల్లో జెండర్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. పురుషులతో సమానంగా వారికి వేతనం అందే హామీ ఇస్తున్నానని' పినరయ్ విజయన్ వివరించారు.

ప్రభుత్వ ఉమెన్-ఫ్రెండ్లీ విధానాలను ప్రస్తావించిన కేరళ సీఎం, ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు రుతుక్రమ సెలవులను ప్రవేశ పెట్టడం ద్వారా కేరళ రాష్ట్రం దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. జాతీయ సర్వే ప్రకారం, రాష్ట్రంలో ఉన్నత విద్యలో అత్యధికంగా మహిళల భాగస్వామ్యం ఉంది. దీన్ని ఉద్యోగాల్లోనూ ప్రతిబింబించేలా చూడాలని విజయన్ పేర్కొన్నారు. స్టార్టప్ రంగంలో మహిళల వృద్ధి గురించి మాట్లాడిన ఆయన, కేరళలో కొత్తగా ప్రారంభించిన స్టార్టప్‌లలో 40 శాతం మంది పారిశ్రామికవేత్తలు మహిళలేనని, ఈ రంగం రూ. 8,000 కోట్ల పెట్టుబడుల్లో రూ. 1,500 కోట్లు మహిళా పారిశ్రామికవేత్తలదే అన్నారు. సామాజిక పురోగతి సాధించడానికి మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రం నామమాత్రంగానే జెండర్ బడ్జెట్‌ను అనుసరిస్తోందన్నారు. ఒక్కసారి కూడా మొత్తం బడ్జెట్‌లో ఆరు శాతానికి మించలేదన్నారు.


Next Story