పాక్ చేరుకున్న ఇరాన్ బృందం: పశ్చిమ ఆసియాలో శాంతి దిశగా అడుగులు?

by Kema Shiva Kumar |

అమెరికాతో శాంతి చర్చల కోసం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కలీబాఫ్ నేతృత్వంలోని బృందం పాకిస్తాన్ చేరుకుంది.

పాక్ చేరుకున్న ఇరాన్ బృందం: పశ్చిమ ఆసియాలో శాంతి దిశగా అడుగులు?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, శాశ్వత శాంతిని నెలకొల్పే లక్ష్యంతో అమెరికాతో జరగనున్న కీలక చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇవాళ తెల్లవారుజామున పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ కలీబాఫ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ప్రతినిధి బృందంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ అలీ అక్బర్ అహ్మదియాన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దోల్నాజర్ హెమ్మతీతో పాటు పలువురు సైనిక, ఆర్థిక మరియు న్యాయ నిపుణులు ఉన్నారు. వీరికి ఇస్లామాబాద్ విమానాశ్రయంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ఘనస్వాగతం పలికారు.

ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన షరతులు

చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ స్పీకర్ కలీబాఫ్ సోషల్ మీడియా వేదికగా రెండు కీలక షరతులను (Preconditions) వెల్లడించారు. ఇజ్రాయెల్ - హిజ్బుల్లా మధ్య యుద్ధం తక్షణమే ఆగాలని అన్నారు. అమెరికా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను (Blocked Assets) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ షరతులు నెరవేరితేనే చర్చలు సజావుగా సాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది.

రంగంలోకి అమెరికా ఉపాధ్యక్షుడు

మరోవైపు, అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ (JD Vance) నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకోనుంది. ఈ బృందంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం. ఇస్లామాబాద్ టాక్స్ (Islamabad Talks) పేరుతో జరుగుతున్న ఈ చర్చలకు పాకిస్తాన్ వేదికగా నిలుస్తోంది. గత ఆరు వారాలుగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పోరాటాన్ని ఆపడానికి, రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story